చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తా: వైఎస్‌ జగన్‌

YS Jagan Promise to Sugar Formers For Reopen Sugar Factories - Sakshi

సాక్షి, యలమంచిలి: అధికారంలోకి రాగానే చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తానని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. 244వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన యలమంచిలి బహిరంగ సభలో ప్రసంగించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వచ్చిన అశేష జనవాహిని ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ ఇలా మాట్లాడారు. 

జగన్‌ అనే నేను...
‘ఈ రోజు యలమంచిలిలో నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఇక్కడి ప్రజలన్న మాటలు నా మనస్సును కలిచి వేసాయి. చక్కెర కర్మగారాలు, నేవల్‌ సంబంధించిన సమస్యలున్నాయని వారు నా దృష్టికి తీసుకొచ్చారు. చక్కెర కర్మగారాల కోసం ఆశపెట్టుకున్న ప్రతి ఒక్కరికి చెబుతున్నా.. మీ ఆశీస్సులు, ఆ దేవుడి దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. చక్కెర కర్మాగారాలు తెరిపిస్తానని జగన్‌ అనే నేను మీ అందరికి హామీ ఇస్తున్నాను. నష్టాల్లో ఉన్న ప్రతి ఫ్యాక్టరీని ఆదుకుంటాం. మూతబడిన ప్రతి ఫ్యాక్టరీని తెరిపిస్తాం.

సీఎం చంద్రబాబుకు నాలుగున్నరేళ్లు కేంద్రంతో సంసారం చేసినప్పుడు నేవల్‌ సమస్యలు గుర్తుకురాలేదు. ఇవాళ ప్రతి ఒక్కరికి మాట ఇస్తున్నాను. నేవల్‌ సమస్యతో నష్టపోయిన ప్రతి మత్స్యకారుడికి కేంద్రంతో సంబంధం లేకుండా దగ్గరుండి పనులు చేయిస్తాను. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కృషి వల్ల బ్రాండెక్స్‌ కంపెనీలో తమకు ఉద్యోగాలు వచ్చాయని అందులో పనిచేసే అక్కచెల్లెమ్మలు చెబుతుంటే సంతోషం కలిగింది. అందులో పనిచేస్తున్న వారికి చెబుతున్నా.. అధికారంలోకి వస్తే బ్రాండెక్స్‌ కంపెనీతో మాట్లాడుతాం.. ఆ కంపెనీకి చేయాల్సిన మేలు చేస్తాం. దానికి దగ్గట్టుగా వేతనాలు పెంచాలని సూచిస్తామన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వచ్చిన మీ అందరితో ఇంకా మాట్లాడాలని ఉంది. కానీ వర్షం వల్ల మాట్లాడలేక ముగిస్తున్నాను. మీ అందరికి కృతజ్ఞతలు’ అని వైఎస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని తొందరగా ముగించారు. అంతకుముందు జననేత  ప్రజాసంకల్పయాత్ర 2800 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top