‘బాబు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు’
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వర్షాలు కురిసి నదులు పొంగి ప్రవహిస్తుంటే చంద్రబాబు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఎప్పుడూ నదులు ఎండిపోయి.. ఇసుక తిన్నెలు తేలి కనిపించాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలా తేలిన ఇసుకను దోచుకునే పదివేల మంది కోటీశ్వరులు అయ్యారని ఆరోపించారు. జలశయాలు నిండితే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు
ఎప్పుడైనా చంద్రబాబు చెప్పేవి ఆ మూడు మాటలే..
చంద్రబాబు మీడియా ముందైనా, సమీక్ష సమావేశాల్లోనైనా మూడు విషయాలు తప్పనిసరిగా చెప్తారని.. ముందే అందరికి తెలిసిపోతుందని విజయసాయిరెడ్డి విమర్శించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్ల సీఎం, పదేళ్ల అపోజిషన్ లీడర్ అని చెప్తారని.. ఇవి లేకుండా ఆయన మాట్లాడలేరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు.. ఈ మాటలు సమయం సందర్భం లేకుండా ఆయనకు ఆయనే చెప్పుకుంటే ఎలా అని ప్రశ్నించారు.
పోలవరంపై అవే పాచి మాటలు..
పోలవరం, అమరావతి, పీపీఏల గురించి చంద్రబాబు అవే పాచి మాటలు మాట్లాడుతున్నారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ‘అవునా కాదా తమ్ముళ్లూ’ అంటూ చంద్రబాబు దీనాలాపనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తను ఎంత ఆవేశపడుతున్నా.. కార్యకర్తల నుంచి స్పందన లేకపోవడంతో చంద్రబాబు వారి వైపు అనుమానంగా చూస్తున్నాడని అన్నారు. ఆయన మాటల్లో వణుకు కనిపిస్తోందని విమర్శించారు.
అమిత్ షాకు జన్మదిన శుభాకాంక్షలు..
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు విజయసాయిరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఆయన చాలా కాలం పాటు దేశానికి సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.