కాంగ్రెస్‌కు ఓటేస్తే మోరీలో వేసినట్టే!

TRS Working President KTR Slams Congress In Warangal - Sakshi

వరంగల్‌‌: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే మోరీలో వేసినట్టేనని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. కేటీఆర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నాయకులు బాత్రూమ్‌కి వెళ్లాలన్నా కూడా ఢిల్లీకి పోతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ వాళ్లు చెప్పే మాటలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు. వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ, కాంగ్రెస్‌ కలిసినా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాదని జోస్యం చెప్పారు. మోదీ గ్రాఫ్‌ పడిపోతోందని, దానికి రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ ఎన్నికలే నిదర్శనమన్నారు. మోదీ ఉపన్యాసాలు తప్ప ఏమీ చేయరని ఎద్దేవా చేశారు. వచ్చే కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ పార్టీల సహకారంతోనే ఏర్పడుతుందని  చెప్పారు. వరంగల్‌ జిల్లా చైతన్యానికి, ఉద్యమాలకు వేదికని, వరంగల్‌ అభివృద్ధికి కేసీఆర్‌ కట్టుబడి ఉన్నారని వ్యాక్యానించారు.

హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌కు తగిన ప్రాధాన్యత, నిధులు ఇస్తున్నామని తెలిపారు. కాజీపేటకు కోచ్‌ఫ్యాక్టరీ తీసుకువస్తామని హామీ ఇచ్చారు. 16 మంది ఎంపీలను గెలిపిస్తే నిధులు, విద్యాసంస్థలు వాటికవే ఉరికివస్తాయని అన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు చెప్పినట్లు చెరువులు మత్తడి దునకాలేనని వ్యాఖ్యానించారు. దేవాదులతో రాష్ట్రం, జిల్లా సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. ఒకప్పుడు మేథావులు అంటే బెంగాల్‌ గుర్తుకువచ్చేదని, కానీ ఇపుడు తెలంగాణ మేధావులకు అడ్రస్‌గా మారిందన్నారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో మన సత్తా చూపిస్తామని వ్యాక్యానించారు. ఎంపీ ఎన్నికలలో పని చేస్తే బోనస్‌గా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తేలికగా గెలుస్తామని అన్నారు. ప్రతికార్యకర్త తమ బూత్‌లోనే పని చేయాలని సూచించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top