ఎగ్జిట్‌ పోల్స్‌: మరో సర్వే.. టీఆర్‌ఎస్‌కే ఆధిక్యం!

Telangana Exit Poll Suverys Result - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకే ఆధిక్యమని వెల్లడవుతోంది. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించబోతున్నదని మెజారిటీ ఎగ్జిట్స్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. ఇండియా టుడే సర్వే టీఆర్‌ఎస్‌కు భారీ ఆధిక్యం వస్తుందని అంచనా వేయగా.. న్యూస్‌ ఎక్స్‌ చానెల్‌ సర్వే హంగ్‌ అసెంబ్లీ రావొచ్చునని పేర్కొంది. తాజాగా వెలువడిన పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌లో కూడా టీఆర్‌ఎస్‌కే మొగ్గు కనిపిస్తోంది. కారుకు 54 నుంచి 61 స్థానాలు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. 44 నుంచి 54 స్థానాలతో కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్‌ గట్టి పోటీనిచ్చే అవకాశముందని పేర్కొంది. కాంగ్రెస్‌ పార్టీకి 40 నుంచి 48 స్థానాలు, కాంగ్రెస్‌ మిత్రపక్షం టీడీపీకి 4 నుంచి 6 స్థానాలు రావొచ్చునని అంచనా వేసింది. బీజేపీకి 3 నుంచి 5 స్థానాలు, ఎంఐఎంకు 6 నుంచి 8 స్థానాలు వస్తాయని, ఇతరులు 5-7 స్థానాలు గెలుపొందుతారని పేర్కొంది.

రిపబ్లిక్‌ టీవీ సర్వే, పీపుల్స్‌ పల్స్‌ సర్వేలు కూడా టీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్‌కు మధ్య గట్టి పోటీ ఉందని పేర్కొన్నప్పటికీ.. కూటమి కన్నా టీఆర్‌ఎస్‌కే ఎక్కువ స్థానాలు వస్తాయని, సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా టీఆర్‌ఎస్సే నిలుస్తుందని అంచనా వేశాయి. సర్వేలన్నింటినీ కలుపుకుంటే.. తిరిగి అధికారంలోకి రావడానికి టీఆర్‌ఎస్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు తేలుతోంది. ఏదిఏమైనా ప్రజాతీర్పు అంతిమంగా ఏమిటన్నది రానున్న 11వ తేదీన స్పష్టం కానుంది.

ఇండియాటుడే సర్వేలో తిరుగులేని మెజారిటీ..
ఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించనుందని.. 79 నుంచి 91 స్థానాలు సాధించి.. తిరుగులేని మెజారిటీ సాధించనుందని అంచనా వేసింది. ఈ సర్వేలో కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్‌కు కేవలం 21 నుంచి 33 స్థానాలు, బీజేపీకి ఒకటి నుంచి మూడు స్థానాలు వస్తాయని పేర్కొంది. ఈ సర్వేలో ఇతరులు నాలుగు నుంచి ఏడు స్థానాలు కైవసం చేసుకోనున్నారని తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 46శాతం ఓట్లు వస్తాయని ఇండియా టుడే మై యాక్సిస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమికి 37శాతం ఓట్లు, బీజేపీకి ఏడుశాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. పాతబస్తీలో గట్టిపట్టు కలిగిన ఎంఐఎం మూడుశాతం ఓట్లు సాధిస్తుందనీ, ఇతరులు ఏడుశాతం ఓట్లు గెలుచుకుంటారని తెలిపింది.

టైమ్స్‌ నౌ సర్వేలో..
అధికార టీఆర్‌ఎస్‌కు 66 స్థానాలు, ప్రజాఫ్రంట్‌కు 37 స్థానాలు, బీజేపీకి ఏడు స్థానాలు వస్తాయని టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌ పోల్స్‌లో అంచనా వేసింది. ఇక, రిపబ్లిక్‌ టీవీ ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో టీఆర్‌ఎస్‌-ప్రజాకూటమి మధ్య హోరాహోరీ ఉన్నట్టు తేలింది. టీఆర్‌ఎస్‌కు 50 నుంచి 65 స్థానాలు, కాంగ్రెస్‌కు 38 నుంచి 52 స్థానాలు, బీజేపీకి నాలుగు నుంచి ఏడు స్థానాలు వస్తాయని రిపబ్లిక్‌ టీవీ పేర్కొంది. ఇక, న్యూస్‌ ఎక్స్‌ సర్వే తెలంగాణలో హంగ్‌ అసెంబ్లీ వచ్చే అవకాశముందని పేర్కొంది. ఈ సర్వేలో టీఆర్‌ఎస్‌కు 57 స్థానాలు, కూటమికి 46, బీజేపీకి 6, ఇతరులకు 10 స్థానాలు వస్తాయని పేర్కొంది. ఇండియా టీవీ సర్వేలో 62 నుంచి 70 స్థానాలు టీఆర్‌ఎస్‌కు వస్తాయని, కూటమికి 33 నుంచి 41 స్థానాలు వస్తాయని, బీజేపీ 6-8, ఇతరులు 6-8 స్థానాలు గెలుపొందుతారని అంచనా వేసింది. ఆరా సంస్థ చేసిన సర్వేలో టీఆర్‌ఎస్‌కు 75-85 స్థానాలు, ప్రజాఫ్రంట్‌కు 25-35 స్థానాలు, బీజేపీకి 2-3 స్థానాలు, ఎంఐఎంకు 7-8 స్థానాలు, ఇతరులకు 0-3 స్థానాలు వస్తాయని పేర్కొంది. ఇక, పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్‌ సర్వేలో టీఆర్‌ఎస్‌కు 54-61 స్థానాలు, కాంగ్రెస్‌కు 40-48 స్థానాలు, టీడీపీకి 4-6 స్థానాలు, బీజేపీకి 3-5 స్థానాలు, ఎంఐఎంకి 6-8, ఇతరులు 5-7 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.

సర్వే చేసిన సంస్థ టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌(ఫ్రంట్‌) బీజేపీ  ఇతరులు
టైమ్స్‌ నౌ 66 37 07 09
ఇండియా టుడే 79-91 21-33 01-03 04-07
రిపబ్లిక్‌ టీవీ 50-65 38-52 4-7 08-14
న్యూస్‌ ఎక్స్‌ 57 46 06 10
ఇండియా టీవీ 62-70 33-41 06-08 06-08
ఆరా సంస్థ 75-85 25-35 02-03 07-11
పీపుల్స్‌ పల్స్‌ 54-61 44-54 3-5 11-15

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top