అరాచకాలు భరించలేకపోతున్నాం

Peoples are telling there problems to YS Jaganmohan Reddy about ruling party leaders - Sakshi

వైఎస్సార్‌సీపీ మద్దతుదారులమని అధికార పార్టీ నేతలు కక్ష సాధిస్తున్నారు  

విపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట గోడు వెళ్లబోసుకున్న జనం 

ప్రజా సంకల్పయాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి : ‘విపక్షం అంటేనే టీడీపీ వాళ్లు విరుచుకుపడుతున్నారు.. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులమని తెలిస్తే చాలు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు.. కనీస మానవత్వం కూడా మరచిపోతున్నారు.. పేదలు, దివ్యాంగులు, అభాగ్యుల విషయంలోనూ కనికరం చూపడం లేదు.. వారి అరాచకాలు భరించలేకపోతున్నాం. ఒకటా? రెండా? చెప్పుకుంటూపోతే మా బాధలు వర్ణణాతీతం..’ అని అధికార టీడీపీ నేతలు, ప్రస్తుత ప్రభుత్వ తీరుతో ఇక్కట్లు ఎదుర్కొంటున్న ప్రజలు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆయన (చంద్రబాబు) మాటలు నమ్మి న్యాయం చేస్తారని ఓట్లు వేసి గెలిపించాం.

నాలుగేళ్లుగా ఒక్క హామీ నెరవేరకపోగా, కొత్త కష్టాలు చుట్టుముట్టాయ’ని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 72వ రోజు శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఓజిలి మండలం చిలమానుచేను క్రాస్‌ నుంచి మొదలైన జగన్‌ పాదయాత్ర వెంకటగిరి నియోజకవర్గంలోని తిమ్మసముద్రం వరకూ సాగింది. అన్ని గ్రామాల్లోనూ ప్రజలు జననేతకు బ్రహ్మరథం పట్టారు. కాండ్రా∙గ్రామంలో ఇసుకేస్తే రాలనంతగా జనం తరలివచ్చారు. తమ కష్టాలు వినే నాయకుడు వచ్చాడంటూ చిన్నా పెద్దా.. అభిమాన నేత అడుగులో అడుగులేస్తూ తమ గుండెల్లోని బాధను చెప్పుకున్నారు. అధికార పార్టీ నేతల వేధింపులు, అన్యాయాలను ఏకరువు పెట్టారు. అందరి సమస్యలను ఓపికగా విన్న జగన్‌.. ‘ఇంకో ఏడాది ఓపిక పట్టండి.. మనందరి ప్రభుత్వం వస్తుంది. అందరి కష్టాలు తీరుతాయి. అన్ని వర్గాల వారినీ ఆదుకుంటాం’అని ధైర్యం చెబుతూ ముందుకు సాగారు.   

మా బడి పరిస్థితి చూడండన్నా.. 
చిలమాను క్రాస్‌ దాటి ముందుకెళ్తున్న పాదయాత్ర ఒక్కసారిగా గురుకుల పాఠశాల వద్ద ఆగింది. అక్కడ పిల్లలు జగన్‌కు ఏదో చెప్పాలని పరుగు పరుగున వచ్చారు. ‘అన్నా.. 1994లో మా స్కూలు నిర్మించారు. పక్కనే క్వారీ ఉంది. ప్రహరీ గోడ లేదు. పిల్లలు అటుగా వెళ్తూ క్వారీలో పడి చనిపోతున్నారు. ఇలా ఎంతో మంది ప్రాణాలు పోయాయయన్నా’ అని చిన్నారులు వివరించారు. అధిపార్టీ నేతలు, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదన్నారు. అనంతరం.. ‘జగన్‌ సార్‌కు చెప్పాం.. ఇక ఆయనే చూసుకుంటాడు’ అని ఓ విద్యార్థి మీడియా ప్రతినిధులతో అన్నాడు. 

అవ్వా.. నీ మనవడినొచ్చాను.. 
పాదయాత్ర కాండ్రా గ్రామం మీదుగా సాగుతున్నప్పుడు ఓ ఇంటి వద్ద 80 ఏళ్ల వృద్ధురాలు కూర్చు ని ఉంది. ఆమె ముఖంలో ఏదో ఆతృత.. మధ్య మధ్యలో పొన్నుకర్ర సాయంతో పైకి లేవడానికి విఫలయత్నం.. జనసంద్రంలోంచే ఆ దృశ్యాన్ని గమనించిన జగన్‌.. సరాసరి ఆ అవ్వ వద్దకు వెళ్లారు. ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ఆ అవ్వకు కళ్లు కూడా కన్పించవని తెలుసుకుని ‘అవ్వా నీ మనవడిని.. జగన్‌ను వచ్చాను’ అంటూ పలకరించాడు. ఆ అవ్వ కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. నోట మాట రాలేదు. ఈ ఉద్విగ్న భరిత సన్నివేశం అక్కడున్న వారందరినీ కాసేపు కట్టిపడేసింది.   

1000 కిలోమీటర్లకు చేరువలో పాదయాత్ర
ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర సోమవారం వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని దాటనుంది. మూడు వేల కిలోమీటర్ల లక్ష్యంతో గత ఏడాది నవంబర్‌ 6న ఇడుపులపాయ నుంచి మొదలైన పాదయాత్ర వైఎస్సార్, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది.   

వెంకటేశుపల్లిలో దివ్యాంగురాలితో ఆప్యాయంగా మాట్లాడుతున్న జగన్‌ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top