‘ముందస్తు’పై లోకేష్ సంచలన వ్యాఖ్యలు
ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ఏం చెప్తాడని ఎద్దేవా
సాక్షి, అమరావతి : తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలానా అభివృద్ధి చేశామని చెప్పుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర ఏమైనా ఉందా..! అని విమర్శించారు. గడువు తీరకముందే ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్ ప్రజలకు ఏం చెప్తారని ప్రశ్నించారు. తెలంగాణలో ఐటీ, పరిశ్రమలు పెద్దగా వచ్చిన దాఖలాలు కూడా లేవంటూ ఆరోపించారు. కేసీఆర్ నిరుద్యోగులకు భృతి ఇస్తారనుకున్నాం.. కానీ అదికూడా నెరవేర్చలేదని అన్నారు. కేసీఆర్ అర్ధాంతరంగా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడం బాధాకరమన్నారు.
టీఆర్ఎస్, బీజేపీ మధ్య అక్రమ సంబంధం ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ.. ఎంఐఎం తమ మిత్రపక్షమని కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అయినా, టీఆర్ఎస్, బీజేపీల మధ్య పెళ్లి సంబంధమైతే గోత్రాలు కావాలిగానీ.. అక్రమ సంబంధమైతే గోత్రాలతో పనేంటని ఎద్దేవా చేశారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.