ప్రధాని మోదీకి ఎంపీ కవిత కౌంటర్‌ | Sakshi
Sakshi News home page

కేవలం తెలంగాణ ప్రజలతోనే ఫిక్సయ్యాం 

Published Tue, Nov 27 2018 5:21 PM

MP Kavitha Reply To Modi Questioning On Development In Telangana - Sakshi

సాక్షి, కామారెడ్డి: నిజామాబాద్‌ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివారని టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత విమర్శించారు. ప్రధాని స్థాయి వ్యక్తి అలా మాట్లాడటం బాధాకరమన్నారు. బీజేపీ ఎన్నికల ప్రచార సభలో భాగంగా మోదీ.. సీఎం కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ పాలనను విమర్శించిన నేపథ్యంలో కవిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రచార సభలో పసుపు బోర్టు ఏర్పాటును ప్రకటిస్తారని తనతో సహా రైతులందరూ ఆశగా ఎదురుచూశామని కానీ దాని ప్రస్తావనే తీసుకరాలేదని ఎద్దేవ చేశారు. అర్మూర్‌, బాల్కొండ ప్రాంతాల్లో మోదీకి పసుపు పంటలు కనిపించలేదా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్‌ ఫిక్స్‌ అయిందని మోదీ ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలతోనే తాము ఫిక్సయ్యామని, అభివృద్దిలో తెలంగాణ ప్రజలతోనే తమకు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అయిందని చురకలు అంటించారు.

నిజామాబాద్‌లో తిరుగుదాం..
‘నిజమాబాద్‌ జిల్లాలో మౌలిక వసతుల అన్నీ ఉన్నాయి. మోదీకి, బీజేపీకి సవాలు విసురుతున్నా.. నిజమాబాద్‌ జిల్లా మొత్తం తిరుగుదాం.. యెండల లక్ష్మీనారాయణ పేరు మీద అభివృద్ధి జరిగిందా లేక టీఆర్‌ఎస్‌ పేరిట జరిగిందో చూద్దాం?. ఉమ్మడి జిల్లాలో 28 వేల మందికి రెండు కోట్ల ఎనభై లక్షల ఆసరా పెన్షన్‌లు ఇస్తున్నాం.  దేశంలో ఎక్కడా లేనివిధంగా పక్కా ప్రణాళికతో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు పూర్తి చేసి, ఆ తర్వాత రోడ్లు పునర్నిర్మాణం చేశాం. మోదీ వారణాసి మున్సిపాలిటీకి కూడా ఇస్తారో లేదో తెలియదు కానీ నిజామాబాద్‌కు ప్రతీ సంవత్సరం వంద కోట్లు కేటాయిస్తున్నాం. 145 కోట్లతో మంచినీటి పథకం, ఐటీ హబ్‌ ఏర్పాటు, కొత్త రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణం, మెడికల్‌ కాలేజీకి 97 కోట్లు కేటాయించాం, ఇవన్నీ ప్రధాని గమనించాలి. ఏటా సందర్శించి పర్మిషన్‌ ఇస్తారు కదా బాలేకపోతే పర్మిషన్‌ ఎందుకు ఇస్తున్నారు?’అంటూ ఎంపీ కవిత ప్రధాని ప్రసంగంపై విమర్శలు గుప్పించారు.  

Advertisement
Advertisement