లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆమ్ఆద్మీ పార్టీ ఆదివారం కీలక సమావేశం నిర్వహించింది. ఢిల్లీలో నిర్వహించిన ఈ సమావేశానికి ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో సహా, కీలక నేతలు హాజరైయ్యారు. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలను పార్టీ నేతలు వెల్లడించారు. లోక్సభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ పోటీకి దూరంగా ఉంటున్నారనీ, ఆయన కేవలం ఢిల్లీపైనే దృష్టిసారిస్తారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ తెలిపారు.
గత ఎన్నికల్లో కేజ్రీవాల్ యూపీలోని వారణాసి స్థానం నుంచి నరేంద్ర మోదీపై పోటీ చేసి ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఆస్థానంలో తమ పార్టీ తరఫున బలమైన అభ్యర్థిని పోటీలో నిలుపుతామని తెలిపారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, గోవా రాష్ట్రాల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు. యూపీలో కూడా పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో పోటీచేస్తామని ప్రకటించారు.
కాగా ఆప్ తాజా ప్రకటనతో కాంగ్రెస్ పార్టీకి మరోదెబ్బ తగిలినట్లుయింది. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయేతర పక్షాలు కలిసి పోటీచేయ్యాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనకు ఆప్ గండికొట్టింది. కాగా ఇప్పటికే కాంగ్రెస్ లేకుండా ఎస్పీ, బీఎస్పీ కూటమిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీతో పాటు, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఆప్ కొంత ప్రభావం చూపనుంది.