డేటా చౌర్యంపై సమాధానం చెప్పండి బాబూ..

Bhuggana Rajendranath Reddy comments on Chandrababu about Data Scam - Sakshi

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 

రాజీపడే అమరావతికి వచ్చానని అంగీకరించారు 

ప్రెస్‌మీట్‌లో బాబు సెల్ఫ్‌గోల్‌  

మహాకుట్ర అంటూ ఊదరగొట్టి.. అభాసుపాలు 

ఐటీ గ్రిడ్స్, బ్లూఫ్రాగ్‌ సంస్థల కాంట్రాక్టును రద్దు చేయాలి 

ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడేందుకు పోరాటం

సాక్షి, హైదరాబాద్‌: డేటా చౌర్యంపై మూడు రోజుల నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను అయోమయానికి గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే, ప్రజాపద్దుల కమిటీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు శనివారం అమరావతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెల్ఫ్‌గోల్‌ చేసుకున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో బుగ్గన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఖరిని తూర్పారబట్టారు. తాను హైదరాబాద్‌ రాజధానిని ఎందుకు వదలి వేశాడో చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నారని రాజేంద్ర వెల్లడిస్తూ..  చంద్రబాబు ప్రసంగంలో మాట్లాడిన వీడియోను విలేకరులకు చూపించారు. ముఖ్యమంత్రి ఏదో చెబుతారనే ఆశతో మీడియా మిత్రులు వెళితే అక్కడ కొండను తవ్వి.. ఎలుకను కూడా పట్టని పరిస్థితులు కనిపించాయన్నారు.10 ఏళ్లు హైదరాబాద్‌ రాజధానిగా ఉన్నా..కాంప్రమైజ్‌ అయి (రాజీపడి) వెళ్లిపోయానని చంద్రబాబు అన్నారని, అసలు ఎందుకు కాంప్రమైజ్‌ అయ్యారో అందరికీ తెలుసునని అది ఓటుకు కోట్లు కేసు ప్రభావమని రాజేంద్ర అన్నారు. అసలు ఏపీ ప్రజల కష్టాలు చంద్రబాబుకు పట్టడం లేదని, ఓటుకు కోట్లు కేసు వల్లే అమరావతికి పారిపోయారని బుగ్గన మండిపడ్డారు. ‘కిడ్నాపులు చేస్తారు.. ఆస్తులు దొంగతనం చేస్తారు’ అని చంద్రబాబు అంటున్నారని.. అంటే ఆయన పాలనలో శాంతిభద్రతలు లోపించినట్లే కదా?’ అని బుగ్గన ప్రశ్నించారు.  

కేసీఆర్‌తో రాజీ విషయాన్ని బాబు అంగీకరించారు.. 
 కేసీఆర్‌తో రాజీపడిన విషయాన్ని చంద్రబాబే ఒప్పుకున్నారని..ఇంతకాలం రాజధాని కోసం వచ్చేశానని బిల్డప్‌ ఇచ్చిన వ్యక్తే వాస్తవాన్ని  బయట పెట్టారని బుగ్గన అన్నారు. విభజన తరువాత సెంటిమెంట్‌ పేరుతో ఆంధ్రా ప్రజలను రెచ్చగొట్టిన చంద్రబాబు ఇపుడు అఫీషియల్‌గా కొన్ని, అనఫీషియల్‌గా కొన్ని వదలి పెట్టవచ్చని  స్వయంగా చెప్పారని బుగ్గన అన్నారు. ఆయన నిర్ణయంతో ఈ రోజు ఉద్యోగాలు చేసుకుంటున్న భర్తలు  భార్యలను వదలి పెట్టి హడావుడిగా  అమరావతికి వెళ్లారని చెప్పారు. అమరావతిలో ఉద్యోగుల బాధలు ఇంతింత కాదని కుర్చీలు లేక, ఉండేందుకు చోటు లేక నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు.  

తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తారా?   
బాధ్యత గల ప్రభుత్వం ప్రజలు వివరాలు సేకరించి ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తే..  సమాధానం చెప్పకుండా.. తేలుకుట్టిన దొంగలా వ్యవహరించడం ఏమిటని బుగ్గన ప్రశ్నించారు. గజదొంగల పార్టీ టీడీపీ అని, ఆ పార్టీని దొంగతనం చేసే దమ్ము ఎవరికి ఉంటుందని అన్నారు.  ఎన్నికల కమిషన్‌ వద్ద ఉండాల్సిన కలర్‌ ఫొటోలు మీ యాప్‌లోకి ఎలా వచ్చాయి? వాటిని తరువాత ఎందుకు తొలగించారు? టీడీపీ వెబ్‌సైట్‌ను ఎందుకు షట్‌డౌన్‌ చేశారు? చెప్పాలని బుగ్గన డిమాండ్‌ చేశారు. దొంగతనం వేరేవాళ్లు చేస్తే మీ వద్ద ఉన్న ఐటీ గ్రిడ్స్‌ సీఈవో అశోక్‌ ఎందుకు దాక్కున్నారని ప్కరశ్నించారు. 

ఆ డేటా ఐటీ గ్రిడ్స్‌కు ఎలా వెళ్లింది.. 
 ప్రజాసాధికార సర్వే ద్వారా సేకరించిన ప్రజల వ్యక్తిగత సమాచార డేటాను ఎస్‌ఆర్‌ డీహెచ్‌లో పెట్టారని అక్కడి నుంచి ఐటీ గ్రిడ్స్‌ సంస్థకు ఎలా వచ్చిందని బుగ్గన ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్స్‌ నుంచి సేవామిత్ర యాప్‌లోకి ఎలా వెళ్లిందన్నారు. ప్రస్తుతం చంద్రబాబుకు సలహాదారుగా ఉన్న వేమూరి హరికృష్ణ ఈవీఎం కేసులో అరెస్టయిన వ్యక్తి కాదా.. అలాంటి వ్యక్తిని ఎలా సలహాదారుగా పెట్టుకున్నారని ప్రశ్నించారు.  ఐటీ మంత్రి లోకేష్‌ మీడియాతో మాట్లాడాలని.. ఆయన దాక్కుంటే చంద్రబాబు ఏ హోదాలో వివరాలు వెల్లడిస్తున్నారో చెప్పాలన్నారు.  ఐటీ గ్రిడ్స్, బ్లూఫ్రాగ్‌కు ఇచ్చిన కాంట్రాక్టులను రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తుది వరకు పోరాటం చేస్తుందని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు.  

ఫిర్యాదు చేస్తే తప్పేంటి? 
ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే తప్పేముంది? అని బుగ్గన చంద్రబాబును ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదు ఇవ్వడంపై చంద్రబాబు 28వ పేజీ అని పదిసార్లు ప్రస్తావించడం హాస్యాస్పదం అన్నారు. విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో ఎన్నికల కమిషనర్‌కు ఒకన్ని సూచనలు, సలహాలు ఇచ్చారన్నారు. ఇలా సీఈసీ, ఆధార్, ప్రభుత్వం, హోంశాఖకు నాలుగు చోట్ల ఇచ్చారన్నారు. ‘ఎవరైనా ఎగ్జిబిషన్‌లో పర్స్‌ పోగొట్టుకుని పోలీసులతో ‘ఫలానా పసుపు చొక్కా వేసుకున్న వ్యక్తి మీద అనుమానం ఉంది అతను కారెక్కారు ఈ రూట్‌లో వెళ్లారు అని చెప్పటంలో తప్పేముంది’ అని బుగ్గన అన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top