పప్పుల తిప్పలు తప్పవా? | Nuts shortage by illegal storages | Sakshi
Sakshi News home page

పప్పుల తిప్పలు తప్పవా?

Oct 26 2015 1:23 AM | Updated on Sep 3 2017 11:28 AM

పప్పుల తిప్పలు తప్పవా?

పప్పుల తిప్పలు తప్పవా?

లభ్యతలో తగ్గుదల లేకున్నా పప్పుల ధరలు పెరగడానికి అక్రమ నిల్వలు తప్ప మరే కారణమూ కనబడదు.

లభ్యతలో తగ్గుదల లేకున్నా పప్పుల ధరలు పెరగడానికి అక్రమ నిల్వలు తప్ప మరే  కారణమూ కనబడదు. నిల్వలకు పరిమితులను విధించి, అక్రమ నిల్వలకు అవకాశమే లేకుండా చేసే సమర్థవంతమైన వ్యవస్థను నెలకొల్పడం అవసరం. అక్రమ నిల్వల వ్యతిరేక చట్టాలను సమర్థవంతంగా ప్రయోగిస్తుంటే ధరలు గత ఏడాది స్థాయికి దిగివచ్చేలా చేయడం సులువే. పప్పు ధాన్యాలు సామాన్యుల ప్రధాన ప్రొటీన్ ఆహారం. ఉత్పత్తి పెరిగేలా రైతుకు అధిక ధరలను కల్పించడమే సమస్యకు శాశ్వత పరిష్కారం.  
 
 దేశవ్యాప్తంగా జరిపిన దాడుల్లో 36,000 టన్నుల పప్పుల దొంగ నిల్వలను స్వాధీనం చేసుకున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇలా ప్రకటించారో లేదో అక్రమ నిల్వదారులకు, నల్లబజారు వర్తకులకు మద్దతుగా పెద్ద గగ్గోలు మొదలైంది. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీని (ఏపీఎమ్‌సీ) వ్యవసాయ వస్తువుల మార్కెట్‌ను నియంత్రిస్తుంటుంది. వర్తకుల కార్టెల్ (గుత్తాధిపత్య కూటమి) తన ఇష్టానుసారం వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా మార్గాలను శాసించగలగడానికి వీలుగా ఏపీఎమ్‌సీని రద్దు చేయాలని ప్రధాన స్రవంతికి చెందిన ఆర్థికవేత్తలు, వ్యాపార సంస్థలు చాలా కాలంగా కోరు తున్నాయి. అక్రమ నిల్వదారులపై దాడులకు వ్యతిరేకంగా నేడు గగ్గోలు పెడుతున్నవారికి కూడా వారే నేతృత్వం వహిస్తుండటం ఆసక్తికరం.
 
 ఇది కృత్రిమ కొరత
 ఇది ఆశించిన విధంగా జరిగినదే. ఏపీఎమ్‌సీపైకి నేరాన్ని సులుపుగా నెట్టేయగలిగినప్పుడు తప్ప, ఆహార ధరలు పెరుగుతున్నప్పుడల్లా వ్యాపా రస్తులపై దాడులకు వ్యతిరేకంగా ఎప్పుడూ ఇలా సంఘటితంగా గగ్గోలు పెట్టడం జరుగుతూనే ఉంది. తప్పంతా ధోతీ-కుర్తా ధరించే దళారులదే తప్ప, సూటు, బూటు దళారుల తప్పేమీ లేదనుకోవడం రివాజుగా మారిపో యింది. కానీ పప్పు ధాన్యాల విషయంలో, బడా రిటైలు, ఈ-కామర్స్ రంగాలే భారీ ఎత్తున దొంగ నిల్వలకు పాల్ప డుతున్నాయి. అందువల్లనే వారికి బలమైన రక్షణ మద్దతు లభిస్తోంది. పప్పు ధాన్యాల లభ్యతలో (దేశీయ ఉత్పత్తి + దిగుమతులు) తగ్గుదల లేదు. కాబట్టి పప్పుల ధరలు ఆకాశాన్నంటడానికి మరే ఇతర కారణమూ కనబడటం లేదు. మచ్చిక చేయకుండా ఈ వ్యాపారం ఇలాగే సాగడాన్ని ఎంతమాత్రం అనుమతించలేం. నిల్వలకు పరిమితులను విధించి, ఏడాది పొడవునా అక్రమ నిల్వలకు అవకాశమే లేని విధంగా హామీని కల్పించే సమర్థవంతమైన పరిపాలనా వ్యవస్థను శాశ్వత ప్రాతిపదికపై నెలకొల్పడం అవసరం.
 
 నాడు మోదీ చెప్పినట్టు నిషేధమే శరణ్యం
 పప్పు ధాన్యాల ఫ్యూచర్స్, ఫార్వార్డ్ వ్యాపారంపై (భవిష్యత్తులో  ధరల హెచ్చు తగ్గులపై అంచనాల ఆధారంగా జరిగే వ్యాపారం) ప్రభుత్వం గతంలో విధించిన నిషేధం అనవసరమైన గాభరాతో చేపట్టిన చర్య అని పలువురు ఆర్థికవేత్తలు అన్నారు. కానీ అది చాలా ఆలోచనాయుతమైన, సమంజసమైన చర్య. వ్యవసాయ ఉత్పత్తుల ప్యూచర్స్ వ్యాపారం ఎప్పుడూ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతోనే ముడిపడి ఉంటోంది. ప్రధానంగా ఈ కారణంగానే 2011లో నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ముఖ్యమంత్రుల వర్కింగ్ గ్రూప్ ఆహార ధరల నియంత్రణ కోసం నిత్యావసర వస్తువుల విషయంలో ప్యూచర్స్‌ను నిషే దించాలని సూచించింది. 2007లో ప్రపంచవ్యాప్త ఆహార సంక్షోభం నెలకొని 37 దేశాల్లో ఆహారం కోసం అల్లర్లు చెలరేగాయి. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘ఆహార హక్కుపై ప్రత్యేక కమిటీ’ ఐరాస మానవ హక్కుల కౌన్సిల్‌కు సమర్పించిన నివేదికలో వ్యవసాయ ఉత్పత్తుల ప్యూచర్స్ వ్యాపారం ప్రపంచ ఆహార ధరల్లో కనీసం 70 శాతం పెరుగుదలకు కారణమని, తత్పర్యవసానంగానే కనీవినీ ఎరుగని ఆహార సంక్షోభం ఏర్పడిందని తెలిపింది.
 పప్పుల ధరలు దించడం సులువే  
 వర్షాభావ పరిస్థితుల వల్ల, పంట కాలం చివర్లో రుతుపవనాలు త్వరితంగా నిష్ర్కమించడం వల్ల ఈ ఏడాది పప్పు ధాన్యాల ఉత్పత్తిలో తగ్గుదల ఉంటుందని అంచనా వేస్తున్నదే. అయినా రిటైలు ధరలు దిగి రాకపోవడానికి నాకైతే ఎలాంటి కారణమూ కనబడదు. ఇప్పటికే 25 లక్షల టన్నుల పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకున్నారు, అవి కనీసం డిసెంబర్ నాటికి రిటైలు దుకాణాలకు చేరుతాయి. దీంతో ప్రైవేటు మార్కెట్ ఇప్పటికే కుచించుకు పోయింది. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ఎలాంటి తగ్గుదల ఉన్నా దాన్ని దిగుమతి చేసుకున్న పప్పు ధాన్యాలతో తీర్చుకోవచ్చు. అక్రమ నిల్వల వ్యతిరేక చట్టాలను సమర్థవంతంగా ప్రయోగించడాన్ని ప్రభుత్వం కొనసాగిస్తే ధరలు గత ఏడాది స్థాయికి సులువుగా దిగివచ్చేలా చేయవచ్చు.
 
 దిగుమతులు పరిష్కారం కాదు
 ఆహార ధరలు పెరిగినప్పుడల్లా ప్రభుత్వం దిగుమతులను ఆపత్కాల చర్యగా ప్రకటించి, అంతర్జాతీయ ధరలు మండిపోయేలా చేస్తోంది. తద్వారా దిగుమతులను వ్యయభారం పెరుగుతుంది. అందుకు బదు లుగా ప్రభుత్వ విధాన యంత్రాంగం దేశీయ ఉత్పత్తిని పెంచి, దిగుమ తులను తగ్గించుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాల్సి ఉంది. భారతీ యుల ఆహారంలో.. సామాన్యునికి అందుబాటులో ఉండే పప్పు అత్యవసర భాగంగానూ, మాంసకృత్తులకు ప్రధాన వనరుగానూ ఉంటుంది. అందు వల్ల పప్పు ధాన్యాల తలసరి లభ్యతను పెంచడం కోసం కూడా దేశీయ ఉత్పత్తి పెంపుదల కోసం శాయశక్తులా కృషి చేయాల్సి ఉంది. ఆదా యాలు అల్పస్థాయిలోనే నిలిచి ఉంటున్న పరిస్థితుల్లో పప్పు ధాన్యాలు నేడు పేదలకే కాదు మధ్య తరగతికి కూడా ప్రొటీన్లు అధికంగా ఉన్న ఆహారంగానే ఉంటోంది. ప్రస్తుతం పప్పు ధాన్యాల తలసరి లభ్యత 31.6 గ్రాములకు అటూ ఇటూగా ఉంటోంది. ఇది మరీ అతి తక్కువ.
 
 రైతుకు ప్రోత్సాహమే పరిష్కారం
 రానున్న కొన్నేళ్లలో తలసరి లభ్యత కనీసం 100 గ్రాములకు పెరిగేలా దేశీయ ఉత్పత్తిలో పెరుగుదలను సాధించే విధానపరమైన కృషి సాగాల్సి ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఆ బాధ్యతను విస్మరించి చేతులు దులిపేసుకుంటూ రైతుల నుంచి నేరుగా 40,000 టన్నుల పప్పు ధాన్యాలను కొని బఫర్ స్టాక్‌ను సృష్టించే ప్రయత్నం మాత్రమే చేస్తోంది. ధరల పెరుగుదల సమస్య పరిష్కారానికి ఈ బఫర్ స్టాక్ తోడ్పడుతుందనడం నిస్సందేహం. కానీ పప్పుధాన్యాలు పండించే రైతులకు అది ఎలాంటి ప్రోత్సాహాన్నీ అందించదు. ధరల స్థిరీకర ణ నిధి వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీ కూడా. కాబట్టి అది వినియోగదా రులను సంతోషపెట్టడానికి చేపట్టిన చర్యనే అనిపిస్తుంది.
 
రైతుల నుంచి కేంద్రం ఈ బఫర్ స్టాక్‌ను కనీస మద్దతు ధరకే సేకరిస్తుంది. మరో విధంగా చెప్పాలంటే, సేకరణ హామీ కొద్ది మంది ఎంపిక చేసిన రైతులకు మాత్రమే లభిస్తుంది. ఈ విధానం మిగతా రైతులందరినీ మార్కెట్టు ఒడిదుడుకుల మధ్య నిస్సహాయంగా గాలికి వదిలేస్తుంది. ఇది అన్యాయం. పప్పు ధాన్యాల దేశీయ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం నిజంగానే చిత్తశుద్ధితో కృషి చేయదలిస్తే సేకరణ హామీతో పాటూ, రైతులకు అధిక ధరలు లభించడానికి కూడా హామీని కల్పించాలి.
 (వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు, hunger55@gmail.com)
 - దేవిందర్ శర్మ

Advertisement
 
Advertisement
Advertisement