‘అవును.. నాకు ఇప్పుడే అర్థమవుతోంది’

Sharad Pawar Counter To PM Modi Says Modi Has No One - Sakshi

ముంబై : ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము చేసిన అభివృద్ధి గురించి చెప్పడం కంటే కూడా ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడటమే లక్ష్యంగా అధికార పార్టీ నేతలు మాట్లాడుతుండగా... ప్రజా సమస్యల గురించి ప్రస్తావించాల్సిన ప్రతిపక్ష నేతలు కూడా వ్యక్తిగత విమర్శలకు దిగడం పరిపాటిగా మారింది. అనుభవం, హోదాతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్క నాయకుడు ఇలాగే వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోదీ, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కూడా ఇలా పరస్పర విమర్శలకు దిగారు. తన కుటుంబంలో సమస్యలు తలెత్తాయంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల పట్ల శరద్‌ పవార్‌ ఘాటుగా స్పందించారు.

‘పవార్‌ సాహెబ్‌ మంచివాడే కానీ ఆయనకు కొన్ని కుటుంబ సమస్యలు ఉన్నాయని మోదీజీ అన్నారు. అసలు నా ఇంట్లో ఏం జరుగుతుందో ఆయనకు ఎందుకు? అవును.. కదా నాకు ఇప్పుడే అర్థమవుతోంది. నాకు భార్యా, కూతురు, అల్లుడు, మేనళ్లుల్లు ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్లంతా నన్ను చూడటానికి వస్తారు. కానీ పాపం మోదీకి ఎవరూ లేరుగా. అలాంటి వాళ్లకు కుటుంబాన్ని నడిపే విధానం ఎలా తెలుస్తుంది? అందుకే ఇతరుల ఇండ్లలో జరిగే విషయాల్లో తలదూర్చాలని ప్రయత్నిస్తాడు. ఆయన గురించి ఇంతకంటే ఎక్కువే మాట్లాడగలను. కానీ దిగజారుడు వ్యాఖ్యలు చేయడం నాకు అలవాటు లేదు’  అంటూ మోదీని విమర్శించారు.

కాగా ఇందుకు సంబంధించిన వార్తను రీట్వీట్‌ చేసిన తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుడు డెరెక్‌ ఓ బ్రెయిన్‌.. ‘అంకుల్‌ శరద్‌ పవార్‌ పంచులు’ అంటూ క్యాప్షన్‌ జత చేశారు. ఇక వారం రోజుల క్రితం వార్ధాలో ప్రచారం నిర్వహించిన నరేంద్ర మోదీ.. ‘ శరద్‌ పవార్‌ ప్రధాని కావాలని కలలుగన్నారు. కానీ పవనాలు ఎటువైపు వీస్తున్నాయో ఆయనకు అర్థమైపోయింది. అదే విధంగా ఆయన స్థాపించిన పార్టీని అజిత్‌ పవార్‌ దక్కించుకోవాలని చూస్తున్నారు. ఎన్సీపీలో కూడా టికెట్ల కోసం కుటుంబంలో కొట్లాట మొదలైంది’ అని శరద్‌ పవార్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top