టీచర్ల ముందే తలనరికిన ఉన్మాది

MP Girl brutally murdered outside school premises - Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఉన్మాది యువతిపై ఘాతుకానికి పాల్పడ్డాడు. టీచర్లు, విద్యార్థుల ముందే ఆమెను తలనరికి కిరాతకంగా హతమార్చాడు. అనుప్పూర్‌ జిల్లాలో గురువారం మధ్యాహ్నాం ఈ ఘటన చోటు చేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోట్మా పట్టణానికి చెందిన 17 ఏళ్ల పూజా పనికా, నిగ్వాని రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో 11వ తరగతి చదువుతోంది. ప్రస్తుతం ఆమెకు పరీక్షలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం పాఠశాలకు వెళ్లిన పూజను ఓ యువకుడు వెంబడించాడు. పాఠశాల గేట్‌ వద్దకు చేరుకోగానే అప్పటిదాకా తనతో దాచుకున్న తల్వార్‌ను  తీసి ఆమెపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశాడు. పూజ వీపు, మెడ, గొంతు భాగంలో పొడిచాడు. కత్తి పోట్లకు ఆమె తల తెగిపడింది. ఆ దృశ్యాన్ని చూసిన టీచర్లు, విద్యార్థులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. 

ఇదంతా చూస్తున్న స్థానికులు పారిపోతున్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ‘బాలిక వెనకాలే అతను రావటం చూశాం. కానీ, ఆమె ఇంట్లో వ్యక్తి అయి ఉంటాడని భావించాం. చివరకు కత్తితో ఆమెపై దాడి చేశాడు. మేమంతా అప్రమత్తం అయ్యే లోపు ఘోరం జరిగిపోయింది’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

అనుమానితుడి అరెస్ట్‌... 
కాగా, 2014లో యువతిని వేధించాడన్న కారణంగా దిలీప్‌ సాహూ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతనే ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని బాలిక తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ఫిర్యాదు చేయగా.. పోలీసులు దిలీప్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని స్థానిక పోలీస్‌ అధికారి విజయ్‌ సింగ్‌ తెలిపారు. స్కూల్‌ ఆవరణలోనే అందరి ముందు ఈ భయానక ఘటన చోటు చేసుకోవటంతో వారం రోజులు మూసివేస్తున్నట్లు స్కూల్‌ యాజమాన్యం ప్రకటించింది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top