తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా సహకరించిందని ఆపార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు.
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా సహకరించిందని ఆపార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్కు చిత్తశుద్ధే ఉంటే 2004లోనే తెలంగాణ ఇచ్చేదన్నారు. కమిటీలతో కాంగ్రెస్ కాలయాపన చేయకుండా ఉంటే వెయ్యిమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని ఉండేవారు కాదని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో తెలంగాణ ఇస్తామనటంతో కాంగ్రెస్ తొందర పడిందని ఆయన అన్నారు. తెలంగాణకు హైదరాబాద్ ఇవ్వాలని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి తానేనని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
బీజేపీ విశ్వసనీయత గల పార్టీ అని, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే వారికి అండగా నిలబడ్డామని వెంకయ్యనాయుడు అన్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ తమ సహకారం లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. తాము పట్టుబట్టడం వల్లే సీమాంధ్రకు కొంతైనా న్యాయం జరిగిందని ఆయన తెలిపారు. సీమాంధ్రలో ఒకలా....తెలంగాణలో మరోలా బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని వెంకయ్య మండిపడ్డారు. కాగా శుక్రవారం ఉదయం వెంకయ్య నివాసంలో ఆయనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే యెన్నెం లక్ష్మీనారాయణ కలిశారు.