కరోనా ఎఫెక్ట్: నెగెటివ్లో పాజిటివ్
రాష్ట్రంలో తగ్గిన వాయుకాలుష్యం
లాక్డౌన్ ఉత్తర్వులతో ఇదో లాభం
కరోనా వైరస్ ప్రబలడం.. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్న ప్రతికూల పరిస్థితుల్లోనూ ఒక అనుకూలమైన లాభం కూడా చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరయ్యే తమిళనాడులో కాలుష్య శాతం బాగా తగ్గిపోయింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నెగెటివ్ వాతవారణంలో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గిపోవడం పాజిటివ్ అంశంగా మారింది. (గ్రిడ్ కుప్పకూలే అవకాశమే లేదు)
సాక్షి, చెన్నై: కరోనా వైరస్ కట్టడి కోసం గత నెల 24 నుంచి ఈ నెల 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్డౌన్ను చెన్నైలో సైతం కచ్చితంగా అమలు చేస్తున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వాహనాల రాకపోకలు కూడా దాదాపుగా స్తంభించిపోయాయి. ఈ పరిణామంతో రాష్ట్రవ్యాప్తంగా వాయు కాలుష్యానికి తావు లేకుండా పోయింది. వాయుకాలుష్యం ఎక్కువగా ఉండే నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్కతాలో 60 నుంచి 70 మైక్రోగ్రాములుగా నమోదవుతూ ఉంటుంది. ఇక తమిళనాడులో చెన్నై, తిరుచ్చిరాపల్లి, తూత్తుకుడి, కోయంబత్తూరు తదితర నగరాల్లో పర్యావరణం, కాలుష్య నియంత్రణ మండలి వారు ప్రస్తుత పరిస్థితిపై సర్వే ప్రారంభించారు.
రాష్ట్రంలోని ఆయా నగరాల్లో సహజంగా 130 నుంచి 180 మైక్రోగ్రాముల వరకు వాయు కాలుష్యం నెలకొని ఉంటుంది. అయితే ఈ లాక్డౌన్ రోజుల్లో వాయు కాలుష్యం 60–80 శాతానికి తగ్గిపోయింది. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాట్లాడుతూ లాక్డౌన్ ఉత్తర్వుల మూలంగా రాష్ట్రంలో వాయు కాలుష్యం బాగా అదుపులోకి వచ్చిందని, అలాగే చెన్నైలో 60 మైక్రోగ్రాములకు తగ్గిపోయిందని తెలిపారు. ఈ ప్రమాణం ప్రజలు శ్వాస తీసుకునేందుకు అనువైనదిగానే ఉంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో సైతం వాయు కాలుష్యం దాదాపుగా ఇదే స్థితికి చేరుకుంది. కరోనా వైరస్ బాధితుడు ప్రధానంగా శ్వాస తీసుకోలేని ఇబ్బందులను ఎదుర్కొంటాడు. ఈ సమయంలో వాయుకాలుష్యం గణనీయంగా తగ్గడం శుభపరిణామమని అధికారులు చెబుతున్నారు.