
సాక్షి, న్యూఢిల్లీ : సాధారణంగానే తన అభిమానులకు చేరువగా ఉండే దక్షిణాది ప్రముఖ నటుడు, పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారబోతున్న రజనీకాంత్ ఫేస్బుక్లో చేరారు. త్వరలో తన పార్టీని ప్రకటించి తమిళనాట రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్న ఆయన మరో సామాజిక మాధ్యమంలోకి అడుగుపెట్టారు. నేటి రాజకీయాలను సోషల్ మీడియా ఎంతగా ప్రభావితం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్షణాల్లో దేనికి సంబంధించిన విషయాన్నయినా తెలుసుకునేందుకుగానీ, తెలియపరిచేందుకుగానీ, మీడియా కంటే కూడా శరవేగంగా పనిచేస్తున్న ఆయుధం సోషల్ మీడియా. బహుశా దీనిని గుర్తించే రజనీ నాలుగు రోజుల కిందట ఇన్స్టాగ్రమ్లో తాజాగా ఫేస్బుక్లో ఖాతా తెరిచారు. అందులో వనక్కం (నమస్కారం) అనే ఒకే ఒక మాటను తొలి పోస్ట్గా చేశారు.
22గంటల కిందటే సోషల్ మీడియాలో అడుగుపెట్టిన ఆయనకు అప్పుడే లక్షన్నరమందికి పైగా ఫాలోవర్స్ పెరిగారు. ఇక నాలుగు రోజుల కిందట ఇన్స్టాగ్రమ్లో చేరిన ఆయన తన 2016నాటి కబాలి చిత్రంలోని పోస్టర్ను పెట్టిన విషయం తెలిసిందే. అందులో ప్రతి ఒక్క తన అభిమానికి తాను దగ్గరవుతున్నాననే విషయం చెప్పండంటూ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా.. వర్చువల్ వరల్డ్లోకి స్వాగతం తలైవా అంటూ ఓ అభిమాని రజనీ ఫేస్బుక్ పేజీకి కామెంట్ పెట్టగా.. రజనీకాంత్ను ఎట్టకేలకు ఫేస్బుక్ చేర్చుకుంది అంటూ మరో అభిమాని జోక్ చేశాడు. నాలుగేళ్ల కిందటే ఆయన ట్విటర్ ఖాతాను తెరిచి మైండ్ బ్లోయింగ్ అయ్యే రేంజ్లో ఫాలోవర్స్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.