అక్షయ్‌పై ఆరోపణలు.. నటి క్లారిటీ | Sakshi
Sakshi News home page

‘ఆ ఉద్దేశంతో ఆరోపణలు చేయలేదు’

Published Wed, Jul 1 2020 10:43 AM

Shantipriya Gave Clarity Over Allegations Against Akshay Kumar - Sakshi

ముంబై: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ తన శరీర రంగుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని నటి శాంతిప్రియ ఓ ఇంటర్యూలో చేసిన ఆరోపణలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో నటి స్పందిస్తూ సోమవారం ట్విటర్‌ వేదికగా స్పష్టత ఇచ్చారు. ‘అక్షయ్‌ నాకు మంచి స్నేహితుడు. ఎప్పుడు నాతో సరదాగా ఉంటాడు. ఈ క్రమంలోనే నాపై అలా సరదాగా కామెంట్‌‌ చేశాడు. అంతే తప్పా నన్ను బాధించాలని చేసిన వ్యాఖ్యలు కాదు. కానీ ఎదుటి వ్యక్తి రంగుపై సరదాగా వేసిన జోక్స్‌ కూడా వారిని అసౌకర్యానికి గురిచేస్తుందన్న విషయాన్ని మాత్రమే చెప్పాలనుకున్నాను. తప్ప అక్షయ్‌పై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. నేను ఎప్పుడు ఆయన మంచి కోరే వ్యక్తిని’ అని ట్వీట్‌ చేశారు.  (బాలీవుడ్‌కీ హోమ్‌ డెలివరీ)

కాగా శాంతిప్రియ ఇటీవల నవభారత్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ‘‘నేను ఎప్పుడు స్కిన్‌ కలర్‌ స్టోకింగ్స్‌(మేజోళ్లు) ధరించేదాన్ని. ఒకసారి షూటింగ్‌లో అక్షయ్‌ నా మోకాళ్ల ముందరి భాగం నల్లగా కనిపించడంతో నీకు అక్కడ రక్తం గడ్డకట్టిందా అని  చమత్కరించారు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వారు. అయితే అవి సరదాగా చేసిన వ్యాఖ్యలని నాకు తెలుసు. కానీ అప్పుడు నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. అక్కడే గట్టిగా ఏడ్చాను కూడా’’ అని చెప్పారు. అంతేగాక ‘‘నేను బాలీవుడ్‌ పరిశ్రమకు వచ్చాక నా రంగే నాకు శత్రువైంది. ఇక్కడ నేను చాలా వివక్షను ఎదుర్కొన్నాను. నా ఆత్మవిశ్వాసం దెబ్బతింది, ఒత్తిడికి గురయ్యాను. కొంతకాలం తర్వాత, నా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, చివరికి నా సినీ కెరీర్ ముగిసింది’’ అని చెప్పారు. కాగా శాంతిప్రియ, అక్షయ్‌ కుమార్‌లు కలిసి ‘ఇక్కే పె ఇక్కా’, ‘సౌగంధ్’‌ చిత్రాలలో నటించారు. (సినిమాలపై దావూద్‌ ప్రభావం)

Advertisement

తప్పక చదవండి

Advertisement