నేను ఆరోగ్యంగానే ఉన్నాను: ఎస్‌ జానకి

S Janaki Gives Clarity On Her Health And Slams Fake News - Sakshi

మైసూర్‌: తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని అభిమానులకు దిగ్గజ గాయని ఎస్‌ జానకి విజ్ఞప్తి చేశారు. దక్షిణ భారత సినీ గాయని ఎస్‌ జానకి ఇక లేరనే వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయిన విషయం తెలిసిందే. దీంతో సంగీత అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ వార్తలను జానకి కుటుంబ సభ్యులు ఖండించారు. తాజాగా తనపై వస్తున్న తప్పుడు వార్తలపై జానకి స్పందిస్తూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం మైసూర్‌లో పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని  ఆమె తెలిపారు. అయితే ఇటువంటి రూమర్స్‌ ఎందుకు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదని ఈ దిగ్గజ గాయని ఆవేదన వ్యక్తం చేశారు. (ఆర్జీవీ అదిరిపోయే సమాధానం)

‘జానకి గారికి ఇటీవలే ఓ ఆస్పత్రిలో చిన్న శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. జానకి ఆరోగ్యంపై వదంతులను వ్యాప్తి చేయవద్దు. ఆమె క్షేమంగా ఉన్నారు’ అని జానకి కుటుంబ సభ్యులు, నటుడు మనోబాల వివరణ ఇచ్చారు. అంతేకాకుండా గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సైతం ఈ తప్పుడు వార్తలను ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ వీడియో విడుదల చేశారు. ‘జానకమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి నాకు 20 మంది వరకు ఫోన్‌ చేశారు. ఎందుకంటే సోషల్‌ మీడియాలో జానకమ్మ చనిపోయారంటూ అసత్య వార్తలను వ్యాప్తి చేశారు. ఏంటి ఈ అర్థంపర్థం లేని పనులు. నేను ఆమెతో మాట్లాడాను. ఆమె ఆరోగ్యంగా ఉన్నారు’ అంటూ ఎస్పీ బాలు పేర్కొన్నారు. (ఆ సినిమాలకు సిగ్గు పడుతున్నా..)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top