మహిళలను కొట్టిన నటుడి కూతురు

Naseeruddin Shah Daughter Heeba Shah Assaults Women Employees At Clinic - Sakshi

ముంబై : ప్రముఖ నటుడు నసీరుద్దీన్‌ షా కుమార్తె హీబా షా.. మహిళా ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశారు. ఈ నెల 16న హీబా షా తన స్నేహితురాలికి చెందిన రెండు పిల్లులను స్టెరిలైజేషన్(శస్త్ర చికిత్స) కోసం ముంబైలోని వెటర్నరీ క్లినిక్‌కు వెళ్లారు. అక్కడ పనిచేసే మహిళా సిబ్బంది ఆమెను వేచి ఉండమని చెప్పగా.. అసహనానికి గురైన హీబా ఇద్దరు మహిళలను కొట్టారు. ఈ దృశ్యాలన్నీ సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అవ్వడంతోఆమె అడ్డంగా దొరికి పోయారు. ఇక ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఘటనపై షీబాకు వ్యతిరేకంగా ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆస్పత్రి చైర్మన్‌ మాట్లాడుతూ.. ‘నటి హీబా షా స్టెరిలైజేషన్ కోసం రెండు పిల్లులతో తమ వెటర్నరీ క్లినిక్‌కు వచ్చారు. పిల్లులకు స్టెరిలైజేషన్‌ జరిగిందని, తమ సిబ్బంది ఆమెను అయిదు నిమిషాలు వేచి ఉండమని కోరారు. రెండు మూడు నిమిషాలు వేచి ఉండి.. అంతలోనే ఆమె మా సిబ్బందిపై దూకుడుగా ప్రవర్తించారు. నేను ఎవరో మీకు తెలియదా? ఎవరో తెలియకుండానే మీరు నన్ను ఇంతసేపు బయట వేచి ఉంచుతారా అంటూ ఆసుపత్రి మహిళా సిబ్బందిపై దాడి చేశారు’ అని పేర్కొన్నారు.

కాగా, ఈ విషయంపై స్పందించిన హీబా.. ఆసుపత్రి ఉద్యోగులను కొట్టినట్లు అంగీకరించారు. అయితే ముందుగా ఆసుపత్రి సిబ్బందే తన పట్ల అమర్యాదగా ప్రవర్తించారని ఆరోపించారు. క్లినిక్‌కు వెళ్లినప్పుడు తన వద్ద అపాయింట్‌మెంట్ ఉందని చెప్పినా కూడా వాచ్‌మెన్‌ లోపలికి అనుమతించలేదని,  అనేక ప్రశ్నలు అడిగాడని తెలిపారు. లోపలికి వచ్చాక సిబ్బంది కూడా తనతో అసభ్యంగా మాట్లాడారని.. అక్కడున్న మరో మహిళ తనను ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లిపోవాలని నెట్టేసిందని పేర్కొన్నారు. క్లినిక్‌కు వచ్చిన వారితో ప్రవర్తించే విధానం ఇది కాదని,  మర్యాదగా మాట్లాడాలని హీబా షా సూచించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top