
సెయింట్లుగా చిన్నారులు
పోర్చుగల్ దేశంలోని ఫాతిమా పట్టణంలో వందేళ్ల క్రితం కన్నె మేరీ దర్శనమైన ఇద్దరు చిన్నారుల్ని పోప్ ఫ్రాన్సిస్ సెయింట్(పునీత)లుగా ప్రకటించారు.
ఇద్దరికి హోదా ప్రకటించిన పోప్
ఫాతిమా(పోర్చుగల్): పోర్చుగల్ దేశంలోని ఫాతిమా పట్టణంలో వందేళ్ల క్రితం కన్నె మేరీ దర్శనమైన ఇద్దరు చిన్నారుల్ని పోప్ ఫ్రాన్సిస్ సెయింట్(పునీత)లుగా ప్రకటించారు. శనివారం ఫాతిమాలోని వైట్ బాసిలికా చర్చి ముందు ఫ్రాన్సికో మార్టో, జసింతా మార్టోల్ని సెయింట్లుగా ప్రకటించే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
దాదాపు 5 లక్షల మంది ఈ కార్యక్రమానికి హాజరైనట్లు వాటికన్ ఒక ప్రకటనలో తెలిపింది. 1917 మే నుంచి అక్టోబర్ మధ్యలో జసింతా(7), ఆమె సోదరుడు ఫ్రాన్సికో(9), సోదరి లూసియా(10)లకు కన్నె మేరీ ఆరుసార్లు కనిపించి మూడు భవిష్యత్ దర్శనాల్ని వారికి చూపించినట్లు క్యాథలిక్కులు భావిస్తారు. 1919లో ఫ్రాన్సికో , తర్వాతి సంవత్సరం జసింతా మరణించారు. 2000 సంవత్సరంలో జసింతా, ఫ్రాన్సికోకు సెయింట్ హోదా ఇచ్చే ప్రక్రియను అప్పటి పోప్ జాన్ పాల్ 2 ప్రారంభించారు. 2005లో లూసియా మరణించగా.. ఆమెను కూడా పునీతగా ప్రకటించే కార్యక్రమం ఇప్పటికే మొదలుపెట్టారు.