క్రీస్తు శిష్యుడి జన్మస్థలం వెలుగులోకి..
ఇజ్రాయెల్: ఏసు క్రీస్తుకు మొదటి శిష్యుల్లో ఒకరిగా భావించే సెయింట్ పీటర్ జన్మించిన ప్రాంతాన్ని అమెరికా, ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. ఉత్తర ఇజ్రాయెల్లోని గలిలీ అనే సముద్రం ఒడ్డున ఈ పురాతన గ్రామాన్ని వెలికి తీసింది. సెయింట్ పీటర్తో మరో ఇద్దరు శిష్యుల్లో కూడా ఇదే నగరంలో జన్మించినట్లు ప్రతీతి అని ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త మోర్డెచాయ్ అవియం తెలిపారు. ఈయన గలిలీయాన్ ఆర్కియాలజీ ఇనిస్టిట్యూట్లో పురాతత్వశాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. మొదటి శతాబ్దానికి చెందిన చరిత్రకారుడు ఫ్లావియస్ జోసెఫస్ చెప్పిన ప్రకారం జులియస్ అనే నగరం క్రీశ 30వ శతాబ్దంలో నిర్మించారు.
ఈ నగరాన్ని బెత్సయిదా అనే గ్రామ శిథిలాలపైనే నిర్మించారని, ఈ గ్రామంలోనే పీటర్ జన్మించినట్లు జాన్ సువార్త తెలుపుతోందన్నారు. మత్స్యకారుడైన పీటర్ను క్రైస్తవులంతా కూడా జీసస్ను అనుసరించిన తొలితరం శిష్యుడిగా గుర్తిస్తారు. ఆయనను ఇప్పటికే కేథలిక్ చర్చి తొలిపోప్గా గుర్తించిన విషయం తెలిసిందే. అయితే, పీటర్తోపాటు ఫిలిప్, పీటర్ బ్రదర్గా చెప్పే ఆండ్రూ కూడా ఇదే గ్రామంలో జన్మించి ఇక్కడే జీవించినట్లు కూడా క్రైస్తవులు నమ్ముతారు.
చాలాకాలంగా జూలియస్ నగరం మొత్తాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు మూడు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరుపుతుండగా తాజాగా బెత్సయిదా వెలుగులోకి వచ్చినట్లు పురాతత్వశాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే తాము పలు మట్టిపాత్రలు, నాణాలు, స్నానపు వాటికలు వెలుగులోకి తెచ్చామని, అవన్నీ కూడా ఇది చిన్న గ్రామమే అని నిరూపించేలా ఉన్నాయని, తమకు ఉన్న అంచనా ప్రకారం ఇదే బెత్సయిదానని, పీటర్ జన్మస్థలం అని తెలిపారు.