ఎన్నికల ముందు హడావుడి చేయడం తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏమీ లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ విమర్శ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు హడావుడి చేయడం తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏమీ లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్లో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆచరణ సాధ్యంకాని హామీలు ఇవ్వడం ముఖ్యమంత్రి కేసీఆర్కు అలవాటు అని విమర్శించారు. మెట్రో రైలు, గ్రేటర్ హైదరాబాద్కు తాగునీటికోసం గోదావరి జలాల తరలింపు వంటివి కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువశాతం పనులు పూర్తయ్యాయని ఉత్తమ్ వివరించారు.
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై యువజన కాంగ్రెస్ పెద్ద ఎత్తున పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీని గెలిపించాల్సిన బాధ్యత యువజన కాంగ్రెస్ కార్యకర్తలపైనే ఉందని చెప్పారు. అనిల్కుమార్ మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో యువతకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు జె.గీతారెడ్డి, జి.వివేక్, దానం నాగేందర్, ఎం.అంజన్కుమార్ యాదవ్, డి.సుధీర్రెడ్డి పాల్గొన్నారు.