
ఉమ్మడి హైకోర్టు సాంకేతిక సేవలు అద్భుతం
కక్షిదారులు, న్యాయవాదుల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఉమ్మడి హైకోర్టు అందిస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్ కితాబిచ్చారు.
- సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లోకూర్
- హైకోర్టులో కాగిత రహిత ఈ-కోర్టు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: కక్షిదారులు, న్యాయవాదుల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఉమ్మడి హైకోర్టు అందిస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్ కితాబిచ్చారు. ఈ సేవలను గుర్తించే దేశంలోనే మొదటిసారిగా ‘సమీకృత నేర న్యాయ విచారణ వ్యవస్థ’ను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. దీని ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు కోర్టులు, జైళ్లు, పోలీసు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయాలు, ఫోరెన్సిక్ ల్యాబ్లను అనుసంధానిస్తామన్నారు. ఒకటి రెండు మినహా దాదాపు అన్ని హైకోర్టుల్లో కంప్యూటరీకరణ పూర్తయిందని, మిగిలినవాటిల్లో కూడా ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేస్తామన్నారు.
గత మూడు నాలుగేళ్లలో ఉమ్మడి హైకోర్టులో సాంకేతికంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయని, ఇదంతా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే చొరవతోనే సాధ్యమైందన్నారు. ఆదివారం ఆయన హైకోర్టులో తొలిసారిగా ఏర్పాటు చేసిన ‘కాగితరహిత ఈ-కోర్టు’ను ప్రారంభించారు. అనంతరం జస్టిస్ లోకూర్ మాట్లాడుతూ త్వరలోనే సుప్రీంకోర్టులో కూడా ఈ-కోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రతీ కోర్టుకు 10 పోస్టులను మంజూరు చేస్తామన్నారు.
వీడియో లింకేజీ ద్వారా డబ్బు ఆదా
కింది కోర్టులు, జైళ్లకు మధ్య వీడియో లింకేజీ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జస్టిస్ లోకూర్ అన్నారు. తద్వారా వీడియో కాన్ఫరెన్స్తో ఖైదీలను విచారించే సౌలభ్యం కింది కోర్టులకు ఉంటుందన్నారు. దీనివల్ల ఎంతో డబ్బు, సమయం ఆదా అవుతాయని, ఈ విషయం మహారాష్ట్రలో తాము నిర్వహించిన సర్వేలో తేలిందన్నారు. ఈ సౌకర్యాన్ని అన్ని కోర్టుల పరిధిలో సాధ్యమైనంత త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు.
కక్షిదారులకు సత్వర న్యాయం...
సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ మాట్లాడుతూ... కాగితం వాడకం లేకపోవడం వల్ల చెట్ల నరికివేత తగ్గుతుందని, పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదని అన్నారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించే అవకాశం ఉంటుందన్నారు. న్యాయ విచారణ ప్రక్రియలో కాగిత రహిత కోర్టు భారీ మార్పులు తీసుకురానున్నదని న్యాయమూర్తి, కంప్యూటరైజేషన్ కమిటీ చైర్మన్ జస్టిస్ పి.వి.సంజయ్కుమార్ చెప్పారు. సోమవారం నుంచి ఈ-కోర్టుకు నేతృత్వం వహించనున్న జస్టిస్ పి.నవీన్రావు ఈ విషయంలో ఎంతో చొరవ తీసుకున్నారన్నారు.
వచ్చే ఏడాది నుంచి ఈ-ఫైలింగ్: జస్టిస్ బొసాలే
జస్టిస్ బొసాలే మాట్లాడుతూ... ‘కాగితరహిత కోర్టును ఏర్పాటు చేసిన నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి ఈ-ఫైలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తాం. హైకోర్టులో ఈ-ఆఫీస్ ఏర్పాటు ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇది పూర్తయితే హైకోర్టు, కింది కోర్టుల మధ్య పాలనాపరమైన అంశాల ఫైళ్లన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిలో సాగుతాయి. అలాగే పాలనాపర నిర్ణయాలు, సర్క్యులర్లు, సూచనలన్నీ న్యాయమూర్తులకు ఈమెయిల్ ద్వారానే పంపుతాం. ఉమ్మడి హైకోర్టులోని రికార్డుల డిజిటలైజేషన్ను ఏడాది లోపు పూర్తి చేస్తాం. క్రమంగా కింది కోర్టుల్లోనూ ఈ ప్రక్రియ చేపడతాం. దసరా నుంచి కేసుల విచారణ జాబితా (కాజ్ లిస్ట్) ముద్రణను ఉపసంహరించుకోనున్నాం. దీని వల్ల ఏటా కోటి రూపాయలు ఆదా అవుతుంది’ అన్నారు.