29న రాష్ట్రపతి రాక | president pranb mukharjee coming to hyderabad on june 29th | Sakshi
Sakshi News home page

29న రాష్ట్రపతి రాక

Jun 19 2015 11:08 PM | Updated on Sep 7 2018 1:56 PM

29న రాష్ట్రపతి రాక - Sakshi

29న రాష్ట్రపతి రాక

ఈ నెలాఖరున రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్‌లో విడిదికి రానున్నారు. జూన్ 29న ఆయన రాష్ట్రానికి చేరుకుంటారని రాష్ట్రపతి భవన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది.

హైదరాబాద్ సిటీ: ఈ నెలాఖరున రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్‌లో విడిదికి రానున్నారు. జూన్ 29న ఆయన రాష్ట్రానికి చేరుకుంటారని రాష్ట్రపతి భవన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. పది రోజుల పాటు ఆయన సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేస్తారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్రపతి భవన్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జులై 8 వరకు ఆయన హైదరాబాద్‌లోనే విడిది చేయనున్నారు. ఓటుకు కోట్లు కేసు సంచలనాలు సృష్టిస్తున్న తరుణంలో రాష్ట్రపతి విడిది ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇప్పటికే ఖరారైన ప్రణాళిక ప్రకారం 30వ తేదీన రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ ఇచ్చే విందుకు రాష్ట్రపతి హాజరవుతారు. జులై ఒకటిన మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు రాసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. రెండో తేదీన తిరుపతికి వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. రాష్ట్రపతి నిలయంలో విడిది సమయంలో రాష్ట్రపతి ఇక్కడి నుంచే పలు ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరై తిరిగి హైదరాబాద్ వస్తుంటారు. దీంతో పాటు రాజకీయ ప్రముఖులు, సామాజిక సంఘాలు, ఎన్‌జీవోలు, ప్రజలను కలిసేందుకు ఆయన కొంతసమయం వెచ్చిస్తారు.

రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాల ప్రముఖులతో ‘ఎట్ హోమ్’ కార్యక్రమం నిర్వహిస్తారు. గత ఏడాది డిసెంబర్ 24 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో శీతాకాల విడిదికి రావాల్సి ఉండగా... అనివార్య కారణాలతో ఆ పర్యటన రద్దు అయింది. ఇటీవలే రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చిన ఒక బృందం హైదరాబాద్‌కు వచ్చి ఈ విడిదికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి వెళ్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement