రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు చంద్రబాబు, జలాల విషయం గా ఏపీ చేసిన కుట్రలపై టీజేఏసీ చైర్మన్ కోదండరాం స్పందించలేదేమని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ప్రశ్నించారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు చంద్రబాబు, జలాల విషయం గా ఏపీ చేసిన కుట్రలపై టీజేఏసీ చైర్మన్ కోదండరాం స్పందించలేదేమని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు అడుగుతున్నారంటూ ఆయన శుక్రవారం 20 ప్రశ్నలు లేవనెత్తారు. విభజన సందర్భంగా కేంద్రం తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీలో కలిపేసినప్పుడు మాట్లాడలేదేమని సుమన్ ప్రశ్నించారు.
‘‘పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ చంద్రబాబు కేంద్రానికి లేఖ రాస్తే, ఆ కుట్రలపై ఎందుకు మాట్లాడలేదు? ఓటుకు నోటు కేసు విషయంలో.. హైదరాబాద్లో సెక్షన్–8 అమలు చేయాలని ఏపీ డిమాండ్ చేసినప్పుడు.. తెలంగాణ, ఏపీలకు కలిపి ఇంటర్, ఎంసెట్ పరీక్షలను తామే నిర్వహించేందుకు ఏపీ యత్నించినప్పు డు.. తెలంగాణకు సరిపడా అఖిలభారత సర్వీసు ఉద్యోగులను కేటాయించని అంశంపై.. ప్రత్యేక హైకోర్టు కోసం ఎందుకు స్పందించలేదు’’ అని ప్రశ్నించారు.