15 నుంచి ‘కానిస్టేబుల్’ ఈవెంట్స్ | Events to be conducted Constable exam on july 15 | Sakshi
Sakshi News home page

15 నుంచి ‘కానిస్టేబుల్’ ఈవెంట్స్

Jul 8 2016 2:41 AM | Updated on Sep 4 2017 4:20 AM

కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 15 నుంచి ఆగస్టు 6 వరకు ఈవెంట్స్ (దేహదారుఢ్య పరీక్షలు) నిర్వహించనున్నట్లు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్‌రావు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్‌రావు
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 15 నుంచి ఆగస్టు 6 వరకు ఈవెంట్స్ (దేహదారుఢ్య పరీక్షలు) నిర్వహించనున్నట్లు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్‌రావు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సివిల్, ఏఆర్, టీఎస్‌ఎస్పీ, ఎస్పీఎఫ్, ఫైర్‌మన్ విభాగాల్లో అర్హత సాధించిన 1,92,588 మంది కోసం రాష్ట్రవ్యాప్తంగా 13 కేంద్రాలు, కమ్యూనికేషన్ విభాగంలో అర్హత సాధించిన 27,410 మంది కోసం 6 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
 
  రిజిస్ట్రేషన్, హాల్‌టికెట్ నంబర్ల సహాయంతో పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు సమాచార లేఖలు పొందవచ్చని సూచించారు. సమాచార లేఖల్లో పేర్కొన్న విధంగా కేటాయించిన సమయానికి అభ్యర్థులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఈవెంట్స్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఆధార్‌కార్డు, సర్టిఫికెట్ల ఒరిజినల్ లేదా జిరాక్స్ కాపీలను కచ్చితంగా తీసుకురావాలని పేర్కొన్నారు. వెబ్‌సైట్ నుంచి సమాచార లేఖలను డౌన్‌లోడ్ చేసుకునే క్రమంలో ఏవైనా ఇబ్బందులు వస్తే 040-23150362, 040-23150462 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.    
 

Advertisement
 
Advertisement
Advertisement