వాటిని ప్రచారానికి వాడుకోరాదు | Do not use of canvassing govt vehicles for political activities | Sakshi
Sakshi News home page

వాటిని ప్రచారానికి వాడుకోరాదు

Oct 9 2016 3:59 AM | Updated on Sep 4 2017 4:40 PM

రాజకీయ పార్టీలు ప్రజాధనాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, బహిరంగ ప్రదేశాల్ని ప్రచారం కోసం వినియోగించుకోరాదని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఆదేశించింది.

-  ప్రజాధనాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, బహిరంగ ప్రదేశాల్ని ఉపయోగించుకోరాదు
-  రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం

 
సాక్షి, హైదరాబాద్: రాజకీయ పార్టీలు ప్రజాధనాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, బహిరంగ ప్రదేశాల్ని ప్రచారం కోసం వినియోగించుకోరాదని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి కె.ఎఫ్.విల్‌ఫ్రెడ్ ఈ మేరకు అన్ని రాజకీయపార్టీల అధ్యక్షులు/ప్రధాన కార్యదర్శులు/చైర్‌పర్సన్లు/కన్వీనర్లకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. పార్టీ, పార్టీ గుర్తు గురించి ప్రచారం చేసుకోవడానికి అన్ని పార్టీలకు సమాన అవకాశాలున్నప్పుడే స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిపినట్లు అవుతుందనే ఉద్దేశంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. బీఎస్పీ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు బహిరంగ స్థలాలు, ప్రజాధనాన్ని పార్టీలు ప్రచారానికి వినియోగించుకోవడంపై మార్గదర్శకాలు జారీ చేయాలంటూ జూలై 7న ఉత్తర్వులు జారీ చేసింది.
 
 కోర్టు ఆదేశాల్ని పరిగణనలోకి తీసుకున్న సీఈసీ  జాతీయ, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన అన్ని పార్టీల అభిప్రాయాలనూ స్వీకరించింది. వాటి నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న సీఈసీ తాజాగా ఈ అంశంపై అన్ని పార్టీలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఏ పార్టీ ప్రజాధనాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, బహిరంగ ప్రదేశాల్ని ప్రచారానికి వినియోగించుకోరాదని అందులో స్పష్టం చేసింది. పార్టీ, గుర్తుల ప్రచారానికి ప్రభుత్వ స్థలాల్ని వినియోగించుకోరాదని సూచించింది. దీన్ని ఉల్లంఘిస్తే రాజకీయపార్టీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Advertisement
 
Advertisement
Advertisement