బిల్ కలెక్టర్ @ ఆరు కోట్లు | Bill Collector @ Six crore | Sakshi
Sakshi News home page

బిల్ కలెక్టర్ @ ఆరు కోట్లు

Oct 22 2016 8:12 AM | Updated on Aug 17 2018 12:56 PM

బిల్ కలెక్టర్ @ ఆరు కోట్లు - Sakshi

బిల్ కలెక్టర్ @ ఆరు కోట్లు

ఏసీబీ వలలో మరో భారీ తిమింగలం చిక్కింది

ఏసీబీ దాడుల్లో చిక్కిన జీహెచ్‌ఎంసీ ఉద్యోగి
 
హైదరాబాద్: ఏసీబీ వలలో మరో భారీ తిమింగలం చిక్కింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో పనిచేస్తూ ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నాడన్న ఫిర్యాదుపై ఓ బిల్ కలెక్టర్‌కు చెందిన నివాసాలపై శుక్రవారం ఏసీబీ అధికారులు ఏకధాటిగా దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లో 5 బృందాలు, సిద్దిపేట జిల్లా నంగునూరులో 3 బృందాలు ఒకేసారి దాడులు నిర్వహించి సుమారు రూ. 2.98 కోట్ల విలువచేసే అక్రమ ఆస్తులున్నట్లు కనుగొన్నారు. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం అవి సుమారు రూ. 6 కోట్ల విలువ చేస్తాయని అధికారులు తెలిపారు.

జీహెచ్‌ఎంసీ అబిడ్‌‌స సర్కిల్ 9లో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న మడప నర్సింహారెడ్డి కూకట్‌పల్లిలోని హెచ్‌ఎంటీ శాతవాహననగర్‌లో నివాసం ఉంటున్నారు. 1987లో బిల్ కలెక్టర్‌గా విధుల్లో చేరిన నర్సింహారెడ్డి తక్కువ కాలంలోనే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఆర్జించారని, ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో ఏసీబీ అధికారులు నిఘా వేసి ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లోని నర్సింహారెడ్డి ఇంటితోపాటు స్వగ్రామమైన నంగునూరు, సిద్దిపేటలోని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

హెచ్‌ఎంటీ శాతవాహననగర్‌లోని ఆయన నివాసంలో ఉదయం 6 గంటలకు ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు నిర్వహించగా.. 61 వేల నగదుతో పాటు శాతవాహనగర్‌లోని జీ ప్లస్ త్రీ, కల్యాణ్‌నగర్‌లో జీ ప్లస్ వన్, బాలానగర్‌లో జీ ప్లస్ టూ, కూకట్‌పల్లిలో జీ ప్లస్ టూ అంతస్తుల భవనాలు, 7 ఖాళీస్థలాలు ఉన్నట్లు గుర్తించారు. అందులో నిజాంపేటలో మూడు, కేపీహెచ్‌బీ కాలనీలో ఒకటి, కల్యాణ్‌నగర్‌లో మరొకటి, నంగునూరులో 2 ఉన్నారుు. నంగునూరులో 33 ఎకరాల వ్యవసాయ భూమి, చేర్యాలలో ఎకరం భూమి కలిగి ఉన్నట్లు గుర్తిం చారు. అదేవిధంగా రెండు కిలోల బంగారు ఆభరణాలు, 3.745 కేజీల వెండి వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, మారుతి స్విఫ్ట్ కారు, రెండు ట్రాక్టర్‌లు, మోటార్‌సైకిల్‌తో పాటు బ్యాంక్‌లో 16 లక్షల నగదు, 10 ఇన్సూరెన్స్ పాలసీల్లో పది లక్షల విలువచేసే బాండ్లు కూడా ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. దాడుల్లో పాల్గొన్న వారిలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌లు విజయభాస్కర్‌రెడ్డి, వెంకటేశ్వరరావు, మంజుల, లక్ష్మి, ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.
(తప్పక చదవండీ: జీహెచ్ఎంసీ ఉద్యోగి అక్రమ ఆస్తులు రూ.3కోట్లు!)

కక్షతోనే ఫిర్యాదు
 సిద్దిపేటలోని వ్యవసాయ భూమి విషయంలో నెలకొన్న వివాదంతో తనపై కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్న బంధువులు ఏసీబీకి తప్పుడు ఫిర్యాదులు చేశారని బిల్ కలెక్టర్ మడప నర్సింహారెడ్డి పేర్కొన్నారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, ఎప్పటికప్పుడు ఆదాయపు పన్నులు కూడా చెల్లిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement