నన్ను బద్నాం చేసేందుకే, తల్లి చెంతకు పాప

నన్ను బద్నాం చేసేందుకే, తల్లి చెంతకు పాప - Sakshi


హైదరాబాద్ :  తనను బద్నాం చేసేందుకే తన భార్య శ్రీలేఖ ఆరోపణలు చేస్తోందని సినీ అసోసియేట్ డైరెక్టర్ హరికృష్ణ అన్నారు. భార్యను మానసిక వేధింపులకు గురి చేయటంతో పాటు, పాపను కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ ఆయన శనివారం ఓ టీవీ చానల్తో మాట్లాడారు. కావాలంటే పాపను ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అందుకు పోలీసులు, కేసులంటూ హడావుడి చేయాల్సిన అవసరం లేదన్నారు.


తీవ్ర జ్వరంతో ఉన్న పాపను ఆమె ఆస్పత్రికి కూడా తీసుకు వెళ్లలేదని, దాంతో పాప కోమాలోకి వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో తిట్టానని ఆమె అలిగి పాపను వదిలేసి పుట్టించికి వెళ్లిపోయిందన్నారు. తనకు దర్శకుడిగా సినిమా అవకాశాలు రావటంతో ...తన పేరును పాడు చేసేందుకే ఆమె ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని హరికృష్ణ తెలిపారు.



వివరాల్లోకి వెళితే... రాజేంద్రనగర్ అత్తాపూర్ హుడా కాలనీలో నివాసముండే సినీ అసోసియేట్ దర్శకుడు హరికృష్ణకు 2012లో నెల్లూరు జిల్లా వాకాడుకు చెందిన శ్రీలేఖతో వివాహమైంది. అనుష్క నటించిన అరుంధతి చిత్రానికి హరికృష్ణ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఈ దంపతులకు ఏడాదిన్నర పాప కూడా ఉంది. కాగా పెళ్లైన ఏడాది నుంచే రెండో పెళ్లి చేసుకుంటానని హరికృష్ణ వేధించసాగాడని, తర్వాత పాపను తన వద్దే పెట్టుకుని తనను ఇంటి నుంచి గెంటేశాడని భార్య శ్రీలేఖ ఆరోపించింది. ఇందుకు హరికృష్ణకు అతడి కుటుంబ సభ్యులు కూడా సహకరించారని చెబుతోంది.



దీనిపై శ్రీలేఖ నెల్లూరు జిల్లా వాకాడు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తాజాగా శుక్రవారం శ్రీలేఖ తన భర్త నివాసానికి వెళ్లగా అతడు కుటుంబ సభ్యులు, పాపతో సహా పరారయ్యాడు. దీంతో తనకు న్యాయం చేయాలని, పాపను తనకు ఇప్పించాలని కోరుతూ భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని శ్రీలేఖ నుంచి వివరాలు సేకరించారు. ఇక శ్రీలేఖ ఆందోళనతో ఎట్టకేలకు పాప జాహ్నవి ఆమె చెంతకు చేరింది. హరికృష్ణ తల్లి ....పాపను రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చి శ్రీలేఖకు అందచేసింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top