అప్పుల పుస్తకంలో కవి పేరా?
సాహిత్య మరమరాలు
‘గౌతమీ గాథలు’ రచయిత ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి జీవితంలో జరిగిన సంఘటన ఇది. ఆయన రామచంద్రాపురంలో కొంతకాలం తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయనకు అప్పటికే మంచి కవిగా గుర్తింపు ఉంది. ఆ కాలంలో ఆయన కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాంతో ఒకరోజు పెద్దబజారులోని ఒక నగల దుకాణానికి వెళ్లారు. వస్తువుల్ని తాకట్టు పెట్టుకుని అప్పు ఇచ్చే చోటు అది.
ఇంద్రగంటి వెళ్లేసరికి అక్కడ ఒక గుమస్తా ఉన్నాడు. ఆయన పేరు రొక్కం నరసింహం. చూడటానికి అతి సాధారణ మనిషిలా కనబడ్డాడు. హనుమచ్ఛాస్త్రి తను వచ్చిన కారణం చెప్పగానే నరసింహం నొచ్చుకున్నాడు.
‘అయ్యా, మీ పాండిత్యం తెలుసు, మీ సాహిత్యం తెలుసు. మీలాంటి గొప్ప పండితుడి పేరు అప్పుల పుస్తకంలో ఉండకూడదు’ అన్నాడు. అని, తన పేరు మీద ఆ అప్పు రాసుకుని, హనుమచ్ఛాస్త్రికి కావాల్సిన నగదు ఇచ్చి పంపాడు.