
మెదక్ ఖిల్లాపై ఎగిరే జెండా ఎవరిదో!
మెదక్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య నువ్వా..నేనా అన్నట్లు పోటీ సాగడంతో విజయంపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు.
మెదక్,న్యూస్లైన్: మెదక్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య నువ్వా..నేనా అన్నట్లు పోటీ సాగడంతో విజయంపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతోంది. ఈ మేరకు ఇరువురు అభ్యర్థుల విజయావకాశాలపై బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. బరిలో 11 మంది అభ్యర్థులున్నప్పటికీ టీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి, వైఎస్సార్ సీపీ అభ్యర్థి క్రీస్తుదాస్, టీడీపీ అభ్యర్థి బట్టి జగపతి మధ్యే పోరుసాగింది. అయితే ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే నెలకొంది.
ఈ రెండు పార్టీల అభ్యర్థులు మహిళలే కావడం విశేషం. అందులో ఒకరు ఉద్యమ పార్టీ నుంచి, మరొకరు సినీ నటి కావడంతో జిల్లా వాసులు, పార్టీ వర్గాల దృష్టి అంతా మెదక్ ఫలితాలపైనే కేంద్రీకృతమై ఉంది. ఈనెల 16న ఓట్ల లెక్కింపు జరుగనున్న నేపధ్యంలో మెదక్ ఖిల్లాపై పద్మం వికసిస్తుందా ! విజయ దరహాసం ఆవిష్కృతమవుతుందా !అనే చర్చ సర్వత్రా వ్యక్తమవుతోంది.
వలసలతో టీఆర్ఎస్ ధీమా..
తెంగాణ ఉద్యమానికి పురిటి గడ్డ అయిన మెతుకు సీమలో గులాబీ దండు ఎదురు లేని జైత్రయాత్ర కొనసాగిస్తుందన్న నమ్మకంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నాయి. మెదక్ నియోజక వర్గంలో మొదట ఉద్యమ ఊపు అంతగా కనిపించనప్పటకీ టీడీపీ నేతలు, కార్యకర్తల వలసలతో గులాబీ కోట శత్రు దుర్భేద్యంగా మారింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాలోని అసెంబ్లీ, పార్లమెంటరీ స్థానాల్లో పోటీ చేయడం కూడా గులాబీ గుబాళింపునకు కారణమైంది.
ఇక టీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి గత సర్పంచ్, మున్సిపల్, ఎంపీటీసీ , జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో నియోజక వర్గాన్ని దాదాపు మూడు సార్లు చుట్టి వచ్చారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో సైతం మొత్తం 100 గ్రామ పంచాయతీలు,79 మదిర గ్రామాల్లో ప్రచారం చేశారు. ప్రణాళికా ప్రకారం చేపట్టిన ప్రచారానికి చక్కని స్పందన లభించింది. ఉద్యోగులు, యువకుల ఓట్లపై భారీ ఆశలున్నాయి. మెదక్ పట్టణంలో తప్ప మెదక్ మండలం చిన్నశంకరంపేట,పాపన్నపేట, రామాయంపేట మండలాల్లో తమకే మెజార్టీ ఉంటుందని సుమారు 15 వేల ఆధిక్యంతో విజయం సాధిస్తామన్న ధీమాతో టీఆర్ఎస్ వర్గాలు ఉన్నాయి.
అభివృద్ధిపైనే కాంగ్రెస్ ఆశలు
సాంప్రదాయిక ఓటు..ఎంపీగా మెదక్ నియోజక వర్గానికి విజయశాంతి చేసిన సేవలపైనే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది.నియోజక వర్గంలోని కాంగ్రెస్ నాయకుల మధ్య మొదట్లో ఉన్న అసంత ృప్తి ఆపై సమసి పోవడంతో ఆమెకు కాస్త ఊరట లభించింది. ముప్పై ఏళ్లుగా నియోజక వర్గ ప్రజలు కలలు కంటున్న రైల్వే లైన్ సాకారం చేసిన ఘనత విజయశాంతికి దక్కింది. తెలంగాణ ఉద్యమంలో రాములమ్మ చేసిన పోరాటానికి గుర్తింపు ఉంది. ఎంపీ నిధుల నుంచి ప్రతి గ్రామానికి వీధిలైట్లు, తాగునీటి సదుపాయం కల్పించిన ఆమెపై నియోజవక వర్గ ప్రజల్లో కొంత అభిమానం ఉంది.
అయితే అసెంబ్లీ టికెట్ ఖరారు సమయంలో పార్టీలో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకునేందుకే ఫుణ్యకాలం కాస్తా గడిచి పోయిందనే ఆరోపణలున్నాయి. దీంతో అన్ని గ్రామాల్లో ఆశించిన స్థాయిల్లో విజయశాంతి ప్రచారం చేయలేక పోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందనే ప్రచారాన్ని చేయడంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీ సఫలీకృతం కాలేక పోయారు. మెదక్ పట్టణం, మెదక్ మండలం, పాపన్నపేట మండలాల్లో పార్టీకి మెజార్టీ వస్తుందనే ఆశలున్నాయి. ఎస్సీ, మైనార్టీ, సాంప్రదాయిక ఓట్లపై కాంగ్రెస్ వర్గాలు ధీమాతో ఉన్నాయి.