కట్టుకున్నోడినే... కడతేర్చింది

కట్టుకున్నోడినే... కడతేర్చింది - Sakshi


రోకటితో భర్తను చంపిన భార్య

మైలవరం మండలం గొల్లపల్లెలో దారుణం

భర్త వివాహేతర సంబంధమే కారణం?




పెద్దముడియం :

మైలవరం మండలం గొల్లపల్లె గ్రామంలో శుక్రవారం తెల్లవారు జామున ఓ మహిళ తన భర్తను రోకలితో కొట్టి చంపేసింది. ఇంటి పనులు , వంట పనులు తప్ప బయటి ప్రపంచం తెలియని అమాయకురాలు ఇంతటి దురాగతానికి ఎలా వడిగట్టింది.. వివాహేతర సంబంధాల మురికి కూపంలో మునిగి తేలుతు కుటుంబాన్ని నవ్వుల పాలు చేస్తున్న భర్తపై కట్టలు తెంచుకున్న ఆగ్రహమే ఆ అబలను హంతకురాలుగా మార్చిందా...సహనం కోల్పోయి కేవలం క్షణికావేశంలో ఆమె ఈ హత్యకు పాల్పడిందా? ఈ ప్రశ్నలకు స్థానికుల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.



మైలవరం మండలం గొల్లపల్లె గ్రామంలో శుక్రవారం తెల్లవారు జామున భార్య తన భర్తను రోకలితో కొట్టి చంపిన సంఘటన చోటు చేసుకుంది.పోలీసుల వివరాల మేరకు.. వేల్పుల రామాంజనేయులు, అంకాలమ్మ ఇరువురు భార్యాభర్తలు. వీరు తరుచూ గొడవలు పడుతుండేవారు. వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇరువురు గొడవ పడ్డారు. మద్యం మత్తులో ఉన్న రామాంజనేయులు(50) భార్యపై దాడి చేశాడు. దీంతో భార్య అంకాలమ్మ శుక్రవారం తెల్లవారు జామున భర్తపై రోకలితో దాడి చేసింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీన్ని గమనించిన భార్య తన భర్తను ఎవరో చంపారని పొలీసులు, గ్రామస్తులను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేసింది. అయితే ఎవరూ నమ్మకపోవడంతో పాటు పోలీసులు గట్టిగా అంకాలమ్మను అడగడంతో తన భర్తను తానే చంపినట్లు ఒప్పుకుంది. వీరికి ఇరువురు కుమారులు ఉండగా వారిలో ఒకరు బిటెక్, మరోకరు ఇంటర్‌ మీడియట్‌ చదువుతున్నారు. హత్యకు పాల్పడిన  అంకాలమ్మపై ఎస్‌ఐ రాఘవేంద్రారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



వివాహేతర సంబందాలే కారణమా?

మృతుడు తాగు బోతు కావడమే కాకుండా మొదటి నుంచి వావాహేతర సంబంధాల్లో మునిగి తేలుతుండేవాడని స్థానికులు చెబుతున్నారు. మృతిడి స్వస్థలం అనంతపురం జిల్లా యాడికి మండలం నిట్టూరు గ్రామం.పెళ్లి అయిన కొత్తలో తన స్వగ్రామంలోని ఓ మహిళ తో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆ మహిళ బంధువులు ఇతన్ని హతమార్చాలని పథకం వేశారు. విషయం తెలుసుకొని వైఎస్‌ఆర్‌ జిల్లా మైలవరం మండలం గొల్లపల్లెలో నివాసం ఉంటున్నాడు. ఇక్కడ కూడా అతని తంతు మారలేదు.



గ్రామంలోని ఓ మహిళతో చనువుగా ఉంటూ నిత్యం భార్యను వేధించేవాడు. ఇటీ వల గొర్రెలు మేపుకొంటూ కర్నూలు జిల్లా ప్రాంతానికి వెళ్లి అక్కడ కూడా ఓ విధవరాలు అయిన ఓ మహిళతో వివాహేతర సంబంధం మొదలు పెట్టాడు. అంతటితో ఆగకుండా ఆ మహిళను ఇంట్లోకి తెస్తానని.. ఇరువురితో కలిసి కాపురం చేస్తానని భార్యను ఒత్తిడి చేసేవాడు. ఇందుకు భార్య ఒప్పుకోక పోవడంతో తరుచూ గొడవపడుతూ విడాకులు ఇవ్వాలని పట్టుబట్టేవాడు. ఇక ఓపిక నశించిన ఆమె శుక్రవారం తెల్లవారు జామున ఈ దురాఘాతానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top