నదిలోమునిగి గుర్తుతెలియని వ్యక్తి మృతి
విజయపురిసౌత్(గుంటూరు): స్నానానికి నదిలో దిగి ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతిచెందిన ఘటన కృష్ణవేణి ఘాట్ సమీపంలో గురువారం చోటు చేసుకుంది.
విజయపురిసౌత్(గుంటూరు): స్నానానికి నదిలో దిగి ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతిచెందిన ఘటన కృష్ణవేణి ఘాట్ సమీపంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గుర్తు తెలియని వృద్ధుడు(85) మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కృష్ణవేణి ఘాట్కు కొద్దిదూరంలో నదిలో స్నానానికి దిగాడు. ప్రమాదవశాత్తూ లోతైన ప్రదేశంలోకి జారిపోవడంతో నీటిలో మునిగిపోయాడు. ఇది గమనించిన సమీపంలోని కొందరు మత్స్యకారులు హుటాహుటిన వృద్ధుడిని నీటిలోంచి ఒడ్డుకు చేర్చారు. కొనప్రాణంతో ఉన్న వృద్ధుడు ఆ తరువాత కొద్దిసేపటికే మృతి చెందాడు. మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు. వృద్ధుడి జేబులో మాచర్ల నుంచి హిల్కాలనీకి తీసుకున్న ఆర్టీసీ బస్ టికెట్ ఉంది. మృతుడి ఒంటిపై తెల్ల చొక్కా, తెల్ల పంచె ఉన్నాయి. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విజయపురి సౌత్ ఎస్ఐ వై.కోటేశ్వరావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.