తమ్ముళ్ల ఇసుక దందా.. | Sand robbery in Eluru | Sakshi
Sakshi News home page

తమ్ముళ్ల ఇసుక దందా..

May 18 2016 9:14 AM | Updated on Aug 28 2018 8:41 PM

పోలవరం కేంద్రంగా తెలుగు తమ్ముళ్లు ఇసుక దందా సాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రం వాల్‌కు దిగువన

ఏలూరు: పోలవరం కేంద్రంగా తెలుగు తమ్ముళ్లు ఇసుక దందా సాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రం వాల్‌కు దిగువన యంత్రాలతో భారీగా ఇసుక తవ్వేస్తున్నారు. వందలాది లారీల్లో నింపి తరలిస్తున్నారు. ప్రాజెక్ట్‌కు సమీపంలో ఇసుకను తవ్వడం వల్ల ఇబ్బం దులు వస్తాయని ఇరిగేషన్ అధికారులు ఉన్నతాధికారులకు గతంలోనే లేఖ రాశారు. తెలుగు తమ్ముళ్లు తమ పలుకుబడిని ఉపయోగించి ఆ లేఖను బేఖాతర్ చేశారు. ఇక్కడ లభించే ఇసుక నాణ్యమైనది కావడంతో దీనికి మంచి డిమాం డ్ ఉంది. దీనిని తవ్వి రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాలకు సైతం రవాణా చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే రూ.కోట్లు విలువ చేసే ఇసుక ఇక్కడి నుంచి తరలిపోయింది.
 
 వివరాల్లోకి వెళితే.. పోలవరం మండలంలోని రామయ్యపేట వద్ద గోదావరి ఇసుక తిన్నెలపై పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్ నిర్మాణంలో భాగంగా డయాఫ్రం వాల్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు కూతవేటు దూరంలోనే టీడీపీ నేతలు భారీగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. గతంలో ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ అధికారులు ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేయ టం మంచిది కాదని, తవ్వకాలను నివారించాలని కోరుతూ ఉన్నతాధికారులకు లేఖ రాశారు.తెలుగు తమ్ముళ్లు ఇవేమీ పట్టించుకోకుండా 18చోట్ల ఇసుక తవ్వకాలను భారీఎత్తున సాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పెద్దపెద్ద గోతులు పెట్టి నిత్యం ఇసుకను తవ్వేస్తున్నారు.
 
 రోజూ వందలాది లారీల్లో ఇసుక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాలకూ తరలిపోతోంది. ఇది నాణ్యమైన ఇసుక కావటంతో దీనికి ఉన్న డిమాండ్‌ను అడ్డం పెట్టుకుని దాదాపు 20 పొక్లెయిన్లతో తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. దీన్ని నిలువరించేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రయత్నించినా రాజకీయ ఒత్తిళ్లు రావడంతో వారు మౌనం వహించారు. మంగళవారం ప్రాజెక్ట్ పనులను సందర్శిం చేందుకు వచ్చిన కేంద్ర నిపుణుల బృందం ఈ అడ్డగోలు తవ్వకాలను చూసి అవాక్కైంది. వారు వచ్చిన సమయంలోనే వందలాది వాహనాలు ఇసుక లోడు కోసం రావటం, ఇసుకను తరలించటం వారు పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ కింద ఇంత భారీగా ఇసుక తవ్వేస్తుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నారని అధికారులను ప్రశ్నించారు.
 
 వెంటనే ఈ తవ్వకాలను ఆపివేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా అధికారులు ఎట్టకేలకు స్పందించారు. ఈ ఇసుక ర్యాంపులను తక్షణం మూసివేయాలంటూ మంగళవారం రాత్రి స్థానిక పోలీసు అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. దీంతో వారు ఇసుక కోసం వెళ్తున్న లారీలను అడ్డుకున్నారు. ఇసుక తరలింపు కోసం వచ్చిన లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లోడింగ్‌కు ఉపయోగించే యంత్రాలను కూడా ఇసుక తిన్నెల నుంచి బయటకు తరలిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement