ప్రాణాలు తీసిన నిద్ర మత్తు.. అతి వేగం | road accident.. lady doctor dead | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీసిన నిద్ర మత్తు.. అతి వేగం

Jul 18 2016 2:13 AM | Updated on Sep 4 2017 5:07 AM

స్కార్పియో కారు డ్రైవర్‌ నిద్ర మత్తు, అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ముందు వెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి కారు ఢీకొనడంతో డ్రైవర్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న డాక్టర్‌ దుర్మరణం చెందగా, మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు.

దొరవారిసత్రం (నెల్లూరు) : స్కార్పియో కారు డ్రైవర్‌ నిద్ర మత్తు, అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ముందు వెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి కారు ఢీకొనడంతో డ్రైవర్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న డాక్టర్‌ దుర్మరణం చెందగా, మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మండలంలోని జాతీయ రహదారిపై కలగుంట సమీపంలోని ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపై ఆదివారం వేకువజామున జరిగింది. ఎస్సై మారుతీకృష్ణ కథనం మేరకు... చెన్నై ప్రాంతంలోని పొన్నేరిలో డాక్టర్లు మువ్వా భవాని (48), ఆదిశేషారావు సాయిభవాని డయాబెటిక్‌ సెంట ర్‌ను సుమారు 20 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఆదిశేషారావు తండ్రి సంవత్సరీరికం సందర్భంగా స్వగ్రామమైన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు 14వ తేదీన వెళ్లారు. అక్కడ కార్యక్రమాలు ముగించుకుని 16న భవాని స్వగ్రామం తెనాలికి వచ్చారు. అక్కడ చదువుకుంటున్న కుమారుడిని చూసి శనివారం రాత్రి 8 గంటలకు పొన్నేరికి కారులో బయలుదేరారు. కలగుంట ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వచ్చే సరికి డ్రైవర్‌ నిద్రమత్తులో అతివేగంగా కారును నడపడంతో ముందుగా వెళ్తున్న కంటైనర్‌ లారీని ఢీకొన్నాడు. కారు లారీ వెనుక భాగంలో సగం వరకు దూసుకుపోయింది. దీంతో డ్రైవర్‌ ధరణి నరేష్‌ (30), డాక్టర్‌ భవాని ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. ఆదిశేషారావుకు స్వల్పగాయాలు కాగా, వీరికి సహాయంగా వచ్చిన కుమార్‌ తీవ్రగాయాలతో బయటపడ్డాడు. డ్రైవర్‌ చెన్నై దగ్గరలోని అనపంబట్టు ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలిచారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement