లక్కీడిప్‌ నిర్వాహకుల అరెస్‌​‍్ట | luckydip organizers arrest | Sakshi
Sakshi News home page

లక్కీడిప్‌ నిర్వాహకుల అరెస్‌​‍్ట

Feb 3 2017 11:56 PM | Updated on Aug 20 2018 4:30 PM

లక్కీడిప్‌ నిర్వాహకుల అరెస్‌​‍్ట - Sakshi

లక్కీడిప్‌ నిర్వాహకుల అరెస్‌​‍్ట

లక్కీడిప్‌ పేరిట ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు నిందితులను శుక్రవారం మంత్రాలయం పోలీసులు అరెస్టు చేశారు.

– 12.76 లక్షల విలువైన నగదు, సామగ్రి స్వాధీనం
  
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): లక్కీడిప్‌ పేరిట ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు నిందితులను శుక్రవారం మంత్రాలయం పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 12.76 లక్షల విలువైన నగదు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 6.48 లక్షల నగదు ఉండగా మిగతా 1000 జతల బట్టలు, 360 ఎల్‌ఈడీ ఎమిర్‌జెన్నీస్‌ లైట్లు, 100 స్టీల్‌ క్యారియర్‌ బాక్సులు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ కేఎస్‌ వ్యాస్‌ ఆడిటోరియంలో విలేకరులకు వివరించారు. ఆరు నెలల క్రితం ఎస్‌.రత్నయ్య, పి.రాఘవేంద్ర, జే.చంద్రశేఖర్, రాజశేఖర్‌ అనే వ్యక్తులు కోసిగిలో శ్రీలక్ష్మీ నరసింహ ఎంటర్‌ ప్రైజెస్‌ అనే సంస్థను స్థాపించి లక్కీ డిప్‌ స్కీంను ఏర్పాటు చేశారు.
 
ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకున్నా విలువైన బహుమతులు ఇస్తామని బ్రోచర్లు వేయించి ప్రచారం చేశారు. అందులో వేల రూపాయలు విలువ చేసే స్కూటర్లు, కార్లు, ఫ్రిజ్‌లు, ఏసీలు తదితర వస్తువులను చూపారు. పైన చెప్పిన ఎంటర్‌ ప్రైజెసెస్‌లో ఒక నెలలో వస్తువులను కొనుగోలు చేసిన వారికి కచ్చితంగా ఓ బహుమతి ఇస్తామని నమ్మబలికారు. దీంతో వివిధ మండలాలకు చెందిన 3500 మంది ప్రజల నుంచి రూ.13 లక్షల దాకా వసూలు చేశారు
 
. ఈ నేపథ్యంలో మాధవరానికి చెందిన వగరూరు ఆరోని అనే వ్యక్తి మంత్రాలయం పోలీసు స్టేషన్‌లో లక్కీడిప్‌పై ఫిర్యాదు చేశాడు. దీంతో ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంత్రాలయం సీఐ నాగేశ్వరరావు, వారి సిబ్బంది లక్కీడిప్‌ తీస్తున్నారన్న సమాచారంతో దాడి చేశారు. డీప్‌లో బ్రోచర్లలో ముద్రించిన బైక్‌లు, ఎసీలు, ఫ్రిజ్‌లు, కూలర్లు, తదితర విలువైన వస్తువు ఒక్కటి లేకపోవడం విశేషం. అక్కడ దొరికినవన్నీ 30 నుంచి 60 రూపాయలు విలువ చేసే వస్తువులే ఉన్నాయి. దీంతో పారిపోతున్న ఎస్‌.రత్నయ్య, పి.రాఘవేంద్ర, జే.చంద్రశేఖర్‌లను పోలీసులు వెంబడించి మంత్రాలయం మండలం సుగూరు క్రాస్‌ వద్ద  అరెస్టు చేశారు. రాజశేఖర్‌ పరారీలో ఉన్నట్లు ఎస్పీ వివరించారు. కేసు దర్యాప్తులో పాల్గొన్న హెడ్‌కానిస్టేబుల్‌ యూనిస్, కానిస్టేబుళ్లు చంద్ర,ఖాద్రి, రామకృష్ణనాయక్‌లను ఎస్పీ అభినందించారు.
 
లక్కీడిప్‌లను చూసి మోసపోవద్దు
ప్రభుత్వ అనుమతి లేకుండా లక్కీడిప్‌లను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఆకే రవికృష్ణ హెచ్చరించారు. ఎక్కడైనా లక్కీడిప్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచారం వస్తే పోలీసులకు తెలపాలని, లేదంటే 100కు డయల్‌ చేయాలని సూచించారు. మరోవైపు లక్కీడిప్‌ల ద్వారా విలువైన వస్తువులను పొందవచ్చనే ఆశతో మోసపోద్దని, అక్కడ చెప్పేది ఒక్కటి అయితే ఉండేది మరో వస్తువని పేర్కొన్నారు. సమావేశంలో ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు, సీఐ కే.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
  
 

Advertisement
 
Advertisement
Advertisement