తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో పెళ్లింట విషాదం నెలకొంది. సోమవారం సాయంత్రం పెళ్లి జరుగనుండగా మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మూడు ఇళ్లు దగ్ధమయ్యాయి.
తెనాలి (గుంటూరు జిల్లా) : తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో పెళ్లింట విషాదం నెలకొంది. సోమవారం సాయంత్రం పెళ్లి జరుగనుండగా మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మూడు ఇళ్లు దగ్ధమయ్యాయి. నందివెలుగు గ్రామ శివారులో ఖయ్యూమ్, నాగేశ్వరరావు, ఆదం పూరిళ్లు వేసుకుని కాపురం ఉంటున్నారు. ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారు. ఆదం కుమార్తె జ్యోతి వివాహం పొరుగూరిలోని గుడిలో జరుగనుంది.
కుటుంబీకులందరూ ఇళ్లకు తాళం వేసుకుని గుడికి బయలుదేరారు. ఇంటి ముందు వేసిన పెళ్లి మండపానికి మంటలు అంటుకుని మూడిళ్లూ కాలిపోయాయి. అగ్నిప్రమాదం వార్త తెలియడంతో కొందరు బంధువులు వెనక్కి వచ్చారు. అప్పటికే మూడిళ్లు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు.