నెలల తరబడి వృద్ధులు ఎదురు చూస్తున్న పింఛన్లకు ప్రభుత్వం ఎట్టకేలకు నిధులు విడుదల చేసినా ఇక్కట్లు తప్పటం లేదు. అభయహస్తం పింఛన్ నిధులకూ కరెన్సీ ఎఫెక్ట్ పడింది.
సత్తుపల్లి టౌన్: నెలల తరబడి వృద్ధులు ఎదురు చూస్తున్న పింఛన్లకు ప్రభుత్వం ఎట్టకేలకు నిధులు విడుదల చేసినా ఇక్కట్లు తప్పటం లేదు. అభయహస్తం పింఛన్ నిధులకూ కరెన్సీ ఎఫెక్ట్ పడింది. స్వయం సహాయక సంఘాలలోని 60 సంవత్సరాలు పైబడిన మహిళలకు నెలకు రూ.500 చొప్పున పింఛన్ ఇచ్చేలా 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి అభయహస్తం పథకాన్ని ప్రారంభించారు. వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో ఠంచన్గా ఒకటో తారీకునే వృద్ధ మహిళలు అభయహస్తం పింఛన్లు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేయటంతో పింఛన్దారులు ఇబ్బందులు పడక తప్పటం లేదు.
నగదు కష్టాలతో..
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో కరెన్సీ కష్టాలు అన్ని వర్గాల ప్రజలపై పడ్డాయి. తాజాగా ఈ కరెన్సీ ఎఫెక్ట్ అభయహస్తం పింఛన్లపై కూడా పడింది. ప్రభుత్వం తొమ్మిది నెలల తరువాత పింఛన్ నిధులు విడుదల చేసింది. జిల్లాలో 6,331 మందికి పెండింగ్లో ఉన్న రూ.2.86 కోట్లు మంజూరు చేసింది. కలెక్టర్ లోకేష్కుమార్ ఎంపీడీఓలు, మున్సిపాల్టీలలో కమిషనర్ల బ్యాంక్ అకౌంట్లలోకి వేస్తూ డిసెంబర్ 30న ఉత్తర్వులు జారీ అయ్యాయి.
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా అభయహస్తం పింఛన్దారుల పరిస్థితి తయారైంది. బ్యాంకుల్లో ఒక్కో మండలానికి లక్షల్లో అభయహస్తం నిధులు జమ అయ్యాయి. వాటిని ఇచ్చేందుకు బ్యాంకర్లు కొర్రీలు పెడుతున్నారు. ఏకమొత్తంలో నగదు ఇచ్చేందుకు నిరాకరిస్తుండటంతో లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ జాప్యం అవుతుంది. బ్యాంకుల్లో నగదుకొరత సాకుతో వీటిని ఇచ్చేందుకు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చేవరకు ఇచ్చేది లేదంటూ బ్యాంకర్లు స్పష్టం చేస్తుండటంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
వైఎస్సార్ హయాంలో ఠంచన్గా వచ్చేవి
ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభయహస్తం పింఛన్లు ఠంచన్గా ఒకటో తేదీనే ఇచ్చేవాళ్లు. ఆ తరువాతే మాకు కష్టాలు మొదలయ్యాయి. రాకరాక ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా.. బ్యాంకోళ్లు ఇవ్వటం లేదు.
కె.శిరోమణి, సత్తుపల్లి
మందులకు అవే దిక్కు
ఏ పని చేసుకోలేం.. అసలే షుగర్, బీపీ, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నా.. ఆ íపింఛన్ డబ్బులు వస్తే మందుమాకుకు దిక్కు. పదినెలలుగా ఎదురు చూస్తున్నాం.
పింఛన్ డబ్బులు రాకపోవటతో చాలా ఇబ్బంది పడుతున్నాం.
హెచ్ రఘుపతి, సత్తుపల్లి