రోడ్డు ప్రమాదంలో వైఎస్‌ఆర్‌సీపీ నేత మృతి

YSRCP Leader Died Bike Accident In YSR Kadapa - Sakshi

భార్యకు గాయాలు, మనవరాలు రోహితారెడ్డి మృతి

గాలివీడు : గోపనపల్లె గ్రామ పంచాయతీలోని సి.పురం వాండ్లపల్లెకు చెందిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు నల్లా బత్తిన బోడ్రెడ్డి (46) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అలాగే ఆయన మనవరాలు రోహితారెడ్డి (6) మృతి చెందగా, భార్య జానికమ్మకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే...  బోడ్రెడ్డి చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలోని చిన్నగొట్టిగల్లులో ఉన్న తన కుమార్తె, అల్లుడు ఇంటికి వెళ్లి.. శుక్రవారం తిరిగి గాలివీడుకు మోటార్‌సైకిల్‌పై బయలుదేరారు. ఆయనతోపాటు భార్య జానికమ్మ, మనవరాలు రోహితారెడ్డి వస్తున్నారు.

మార్గంమధ్యలోని పీలేరు – తిరుపతి ప్రధాన రహదారిలో పీలేరు సమీపాన ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో బోడ్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మనవరాలు రోహితారెడ్డి కొనఊపిరితో ఉండడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతుడి భార్య జానికమ్మకు తీవ్ర గాయాలు కావడంతో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోపనపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మండల వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు శోకసంద్రంలో మునిగారు. బోడ్రెడ్డి మృతి పట్ల వారు సంతాపం తెలిపారు.

అంత్యక్రియలకు హాజరు కానున్న ఎమ్మెల్యే  
బోడ్రెడ్డి అంత్యక్రియలకు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, మండలంలోని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు హాజరు కానున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top