వృద్ధురాలిపై అత్యాచారం, దోపిడీ
మాతృదినోత్సవం రోజునే అవ్వపై అఘాయిత్యం
చేబ్రోలు/గుంటూరు మెడికల్: మాతృదినోత్సవం నాడు ఓ మృగాడు పండుముసలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేసిన అనంతరం నగదు దోచుకుని పరారయ్యాడు. ఈ విషాదకరమైన ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరులో ఆదివారం జరగ్గా సోమవారం వెలుగులోకి వచ్చింది. నారాకోడూరు గ్రామానికి చెందిన వృద్ధురాలు (81) తన మనవడితో కలిసి ఉంటోంది.
ఆదివారం రాత్రి సుమారు పది గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి వృద్ధురాలిని నగదు, నగలు ఇవ్వాలని లేకపోతే చంపుతానని బెదిరించాడు. సంచిలో ఉన్న సుమారు రూ.18 వేల నగదు తీసుకున్న ఆగంతకుడు గుండరాయితో ఆమె ముఖంపై దాడి చేసి గాయపరిచాడు. అనంతరం వృద్ధురాలిపై అత్యాచారం చేశాడు.
గాయపడిన ఆమెను 108లో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు స్థానికులు తరలించారు. నగదు కోసం గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి ఆమెను గాయపరిచినట్లు పోలీసులు చెప్పగా బాధితురాలు తనకు చెప్పుకోలేని అన్యాయం జరిగిందని వైద్యులకు, బంధువులకు తెలిపింది. విషయం వెలుగులోకి రావడంతో వృద్ధురాలిపై అత్యాచారం, దోపిడీ జరిగినట్లు సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు.