భార్యను కాపురానికి పంపలేదని..

Husband Commits Suicide In PSR Nellore - Sakshi

ఉరేసుకుని భర్త ఆత్మహత్య  

గూడూరు: భార్యను కాపురానికి పంపలేదని భర్త అత్తగారింట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలోని దూడలకాలువ సమీపంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కోట మండలం సిద్ధవరం గ్రామానికి చెందిన సంపూర్ణమ్మ కుమారుడు ముచ్చకాయల ఏడుకొండలు (31)కి, దూడలకాలువకు చెందిన పద్మమ్మ కుమార్తె సుప్రియకు 11 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరూ కొంతకాలం అన్యోన్యంగా ఉన్నారు. వారికి ఓ కుమార్తె పుట్టింది. అనంతరం కుటుంబకలహాల కారణంగా సుప్రియ తన తల్లివద్దే ఉంటూ టిఫిన్‌ సెంటర్‌ నడుపుతోంది.

నేను వెళ్లను
బుధవారం సుప్రియ ఇంట్లో ఇరు కుటుంబాల పెద్దలు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో భర్త వేధింపులు భరించలేకున్నానని, తాను కాపురానికి వెళ్లేది లేదని సుప్రియ తెగేసి చెప్పింది. దీంతో అందరూ వెళ్లిపోయారు. తన భార్య ఇక కాపురానికి రాదని నిర్ణయించుకున్న ఏడుకొండలు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. పని నిమిత్తం బయటికి వెళుతున్నానని బంధువులకు చెప్పి అత్తగారింటికి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో పద్మమ్మకు ఆరోగ్య పరిస్థితి క్షీణించి ఉండటంతో కుటుంబసభ్యులంతా మేడపై ఉన్నారు.

ఏడుకొండలు ఇంటికి తాళం వేసి ఉండటం చూసి బాత్‌రూంలోంచి ఇంట్లోకి వెళ్లే వెసులుబాటు ఉండటంతో లోపలికి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తలుపు శబ్దం కావడంతో సుప్రియ ఏం జరిగిందో చూసిరావాలని కుమార్తె దీక్షితకు చెప్పింది. బాలిక పొరుగువారిని అడగ్గా మీ నాన్న ఇంట్లోకి వెళ్లాడని చెప్పారు. దీంతో సుప్రియ, కుటుంబసభ్యులు వచ్చి చూడగా బాత్‌రూం తలుపునకు కూడా గడియపెట్టి ఉంది. దాన్ని పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు వెలాడుతూ ఏడుకొండలు మృతదేహం కనిపించింది. ఈ మేరకు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top