సహజీవనం చేస్తున్న జంట ఆత్మహత్య

Dating Couple Commits Suicide in Uppal Hyderabad - Sakshi

ఉప్పల్‌: మొదటి భార్య ఉండగానే మరో యువతితో  సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి తన ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడటంతో కలత చెంది తానూ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం  చోటు చేసుకుంది.  పోలీసులు, కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా, ఉరవకొండ ప్రాంతానికి చెందిన నాదండ నాయుడు(45), రమ్య దంపతతులు మల్కాజిగిరి, వెంకటేశ్వరనగర్‌లోని తిరుమల రెసిడెన్సీలో నివాసముంటున్నారు. వారికి ఒక కుమార్తె.  అయితే గత కొద్దిరోజులుగా నాయుడు కుటుంబానికి దూరంగా ఉప్పల్‌లోని ఇందిరానగర్‌లో ఉండేవాడు. ఈ నేపథ్యంలో ఇంటి యజమాని కుమార్తె అనిత (33)తో ప్రేమలో పడ్డాడు. దీంతో ఇద్దరు కలిసి ఎనిమిది నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయి  ప్రశాంత్‌నగర్‌ రోడ్‌ నంబర్‌–3లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. అయితే ఈ విషయం మొదటి భార్యకు తెలియకుండా గుట్టుగా కాపురం చేస్తున్నాడు.

అనిత ఇంట్లోనే టైలరింగ్‌ పనిచేస్తుండగా నాయుడు సనత్‌నగర్‌లోని లివాల్వ్‌ ఇంజనీర్స్‌లో డెవలప్‌మెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతడికి గతంలోనే వివాహం జరిగిన విషయం తెలియడంతో అనిత నాయుడును నిలదీసింది. దీంతో గత కొద్ది రోజులుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి గొడవ జరగడంతో మనస్తాపానికిలోనైన అనిత బెడ్‌రూంలోకి వెళ్లి తలుపు వేసుకుంది. తెల్లవారుజామున నాయుడు గదిలోకి చూడగా అనిత చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. దీంతో అందోళనకు గురైన నాయుడు ‘‘నేను అమ్ములు(అనిత)కు కరెక్ట్‌ పర్సన్‌ కాదు.. అమ్ములు పోయింది. నేను కూడా పోతున్నా..’’ అంటూ అనిత సోదరుడు శ్రీనివాస్‌కు సెల్‌ఫోన్‌ మెసేజ్‌ పెట్టి హాల్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  సంఘటనా స్థలానికి చేరుకున్న శ్రీనివాస్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఉప్పల్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ వెంకటకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ, భువనగిరి డీసీపీ రాంచంద్రారావు, మల్కాజిగిరి ఏసీపీ సందీప్‌రావు సంఘటనస్థలాన్ని పరిశీలించారు. మృతురాలు అనిత సోదరి ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top