ఆశ్రమం కాదది.. అత్యాచారాల అడ్డా ! | Cops Raid Delhi Ashram | Sakshi
Sakshi News home page

ఆశ్రమం కాదది.. అత్యాచారాల అడ్డా !

Dec 21 2017 8:54 AM | Updated on Dec 21 2017 8:54 AM

Cops Raid Delhi Ashram - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పేరుకే అది ఆశ్రమం. పైకి చూసే వారికి అక్కడ ఆధ్మాత్మిక కార్యక్రమాలు, సేవలు జరుగుతాయి. కానీ, అందులో జరిగేది మాత్రం మరొకటి. గుర్మీత్‌ ఆశ్రమంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయో అచ్చం అలాంటివే. అది కూడా ఢిల్లీకి సమీపంలోనే.. ఎందరో మైనర్ల జీవితాలు ఆ ఆశ్రమంలో కొవ్వొత్తుల్లా కరిగిపోతున్నాయి. ఆశ్రమం కాస్త అత్యాచారాల అడ్డాగా మారడంతో ఈ విషయం గుర్తించిన ఓ ఎన్జీవో చొరవతో దాని బండారం బయటపడింది. పోలీసులు రైడింగ్‌ చేసి రెండు గంటలపాటు కష్టపడి అందులో వారిని అదుపులోకి తీసుకున్నారు. మైనర్లను ఆ కూపంలో నుంచి బయటపడేశారు.

వివరాల్లోకి వెళితే.. రోహిణీ ప్రాంతంలో ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ అనే ఆశ్రమం ఉంది. అందులో దాదాపు 14 ఏళ్లుగా కొంతమంది మైనర్లను, మహిళలను బలవంతంగా నిర్భందించి చేయకూడని పనులు చేస్తున్నారని ఓ ఎన్జీవో గమనించింది. అందులో నుంచి అతి కష్టం మీద ఓ మైనర్‌ను కూడా విడిపించుకొచ్చి కోర్టుకు తీసుకెళ్లి అసలు విషయం చెప్పారు. దీంతో ఇంత జరుగుతున్నా పోలీసులకు ఎందుకు పట్టింపు లేకుండా పోయిందని ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీంతో ఢిల్లీ పోలీసుల బృందం, ఢిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్‌ స్వాతి మలైవాల్‌ బృందం ఏకకాలంలో ఆశ్రమంపై దాడి చేశారు. వారికి కూడా బాధితులను చేరుకునేందుకు దాదాపు రెండు గంటలు పట్టింది. ఈ సందర్భంగా స్వాతి మలైవాల్‌ మీడియాతో మాట్లాడుతూ 'ఆశ్రమంలోకి వెళ్లిన మాపై దాడులు చేసేందుకు వారు ప్రయత్నించారు. దాదాపు గంటసేపు మమ్మల్ని బందించే ప్రయత్నం చేశారు. అందులో తమపై లైంగిక దాడులు జరిగినట్లు భారీ సంఖ్యలో లేఖలు, ఇంజెక్షన్‌లు, మందులు పెద్దమొత్తంలో దొరికాయి' అని చెప్పారు. ఇక ఈ కేసుపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. చుట్టూ గోడలు కట్టి వాటిపై ఫెన్సింగ్‌ పెట్టి బయటపడకుండా జంతువుల్లా చూస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి చెప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement