ఎస్పీ వాహనాన్ని ఢీకొన్న ఆటో

Auto Accident to SP Vehicle In PSR Nellore - Sakshi

మద్యం మత్తులో ఆటోడ్రైవర్‌

ఆటో డ్రైవర్లకు తీవ్ర గాయాలు

ఎస్పీ భార్యకు త్రుటిలో తప్పిన ప్రమాదం   

నెల్లూరు (మినీబైపాస్‌): ఆటో డ్రైవర్లు పూటుగా మద్యం తాగి ఏకంగా ఎస్పీ వాహనాన్నే ఢీకొన్నారు. ఈ ఘటన ఆదివారం స్ధానిక కొండాయపాళెం గేటు సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి సతీమణి ఆర్టీసీ వైపు నుంచి రాజరాశ్వరి అమ్మవారి గుడి వైపు ఇన్నోవా కారులో వెళ్తున్నారు. స్థానిక ప్రభుత్వాస్పత్రి సమీపంలోని స్పీడ్‌ బ్రేకర్ల వద్ద కారు నెమ్మదిగా వెళ్తోంది. అదే సమయంలో మితిమీరిన వేగంతో వెళ్తున్న ఆటో ఇన్నోవా కారును వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో నడుపుతున్న సారాయి అంగడి సెంటర్‌ ప్రగతినగర్‌కు చెందిన భీమకొండ ఆనంద్,   బుజబుజనెల్లూరుకు చెందిన అతని  స్నేహితుడు ఆక్రుతి పురుషోత్తం వెనుక సీట్లో కూర్చొని ఉన్నాడు.

వీరిద్దరు ఆత్మకూరు బస్టాండ్‌ సమీపంలోని ఓ వైన్‌షాపులో పూటుగా మద్యం తాగి ఆటోను వేగంగా నడుపుకుంటూ వెళ్తున్నారు. ఆనంద్‌ మద్యం మత్తులో ఆటోను మితిమీరిన వేగంతో నడుపుతూ అదుపు తప్పి ఎస్పీ సతీమణి ప్రయాణిస్తున్న ఇన్నోవా కారును వెనుక నుండి ఢీకొన్నాడు. ఈ క్రమంలో ఆటోడ్రైవరు ఆనంద్, ఆటోని ఆక్రుతి పురుషోత్తం తీవ్రంగా గాయపడ్డారు. కారు పాక్షికంగా దెబ్బతింది. ఆటో ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఈ విషయం తెలిసిన ట్రాఫిక్‌ పోలీసులు అక్కడకు చేరుకున్నారు.  ఎస్పీ భార్యను హుటాహుటిన మరో వాహనంలో అక్కడి నుంచి తరలించారు. ఆనంద్, పురుషోత్తంలను స్థానిక జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ పి.మల్లికార్జున రావు, సీఐ వేమారెడ్డి వాహనం వద్దకు హుటాహుటిన పరుగులు తీశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్న  ఆటోడ్రెవరు నుంచి మద్యం బాటిల్‌ను ట్రాఫిక్‌ సీఐ వేమారెడ్డి స్వాధీనం చేసుకున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top