
సాక్షి, న్యూఢిల్లీ: అక్షయ తృతీయ సమీపిస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. బులియన్ మార్కెట్లో గురువారం 200రూపాయలకు పైగా లాభ పడిన పసిడి శుక్రవారం బలహీనపడింది. వెండి కూడా ఇదే బాటలో పయనిస్తోంది. అమ్మకాల తీవ్రతతో వెండి, బంగారం రెండూ కీలక స్థాయిలనుంచి వెనక్కి తగ్గాయి. ముఖ్యంగా పసిడి నిన్నటి రూ. 32వేల మార్క్నుంచి కిందికి, వెండి కిలోధర 40వేల రూపాయల నుంచి దిగువకు చేరింది. ఏకంగా రూ.350 నష్టపోయి పది గ్రా. పసిడి 31,800వద్ద ఉంది. వెండి కూడా రూ.250 మేర బలహీన పడింది. విదేశీ మార్కెట్లో బలహీన ధోరణి, ఈక్విటీ మార్కెట్ల లాభాలతో బంగారం ధరలు పడిపోయాయనీ, పెట్టుబడులు బంగారం నుంచి వెనక్కి మళ్లినట్టు ట్రేడర్లు చెప్పారు. దేశ రాజధానిలో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి రూ. 350 తగ్గి రూ. 3039,750 వద్ద ఉంది. 8 గ్రా. సావరీన్ గోల్డ్ రూ.100 క్షీణించి 24,800 వద్ద ఉంది. అలాగే వెండి కిలో ధర రూ. 250 తగ్గి రూ. 39,750 వద్ద ఉంది. అయితే ఫ్యూచర్స్ మార్కెట్లో మాత్రం పసిడి ధరలు స్వల్పంగా కోలుకున్నాయి. పది గ్రా.పసిడి 51 రూపాయలు లాభపడి 31,053 వద్ద ఉంది. అటు ప్రపంచవ్యాప్తంగా బంగారం ఔన్స్ ధర 1.37 శాతం క్షీణించి 1,334.30 డాలర్లకు చేరుకుంది.