తొలి 5జీ ట్రయల్స్ సక్సెస్..
సంయుక్తంగా నిర్వహించిన ఎయిర్టెల్, హువావే
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజ కంపెనీ ఎయిర్టెల్, చైనాకు చెందిన నెట్వర్కింగ్ అండ్ టెలీకమ్యూనికేషన్స్ ఉపకరణాల తయారీ సంస్థ హువావే తాజాగా భారత్లో తొలిసారి 5జీ నెట్వర్క్ ట్రయల్స్ను నిర్వహించాయి. ఇందులో 3 గిగాబైట్ పర్ సెకన్ (జీబీపీఎస్)కుపైగా డేటా స్పీడ్ను సాధించినట్లు ఇరు కంపెనీలు ప్రకటించాయి. గురుగావ్లోని మానేసర్ వద్ద ఉన్న ఎయిర్టెల్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఈ ట్రయల్స్ జరిగాయి.
‘5జీ దిశగా మా ప్రయాణానికి తాజా ట్రయల్స్ చాలా కీలకమైనవి. మన జీవన విధానాన్ని మార్చేయగలిగే శక్తిసామర్థ్యాలు 5జీకి ఉన్నాయి. భారత్లో ఈ కొత్త టెక్నాలజీ ఏర్పాటుకు మా భాగస్వాములతో కలిసి పనిచేస్తాం’ అని భారతీ ఎయిర్టెల్ నెట్వర్క్స్ డైరెక్టర్ అభయ్ సావర్గొంకర్ తెలిపారు. తాము 5జీ టెక్నాలజీ అభివృద్ధికి, దాని ఉపయోగాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామని హువావే వైర్లెస్ మార్కెటింగ్ డైరెక్టర్ ఎమ్మాన్యూల్ కోయెల్హో అల్వెస్ పేర్కొన్నారు.