హిందాల్కో, జిందాల్ పవర్‌కు బొగ్గు బ్లాకులు | Coal block auctions in India see aggressive bidding | Sakshi
Sakshi News home page

హిందాల్కో, జిందాల్ పవర్‌కు బొగ్గు బ్లాకులు

Feb 20 2015 1:39 AM | Updated on Sep 2 2017 9:35 PM

హిందాల్కో, జిందాల్ పవర్‌కు బొగ్గు బ్లాకులు

హిందాల్కో, జిందాల్ పవర్‌కు బొగ్గు బ్లాకులు

బొగ్గు గనుల వేలంలో గురువారం జిందాల్ పవర్ రెండు, ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ హిందాల్కో ఇండస్ట్రీస్ ఒకటి చొప్పున బ్లాకులను దక్కించుకున్నాయి.

న్యూఢిల్లీ: బొగ్గు గనుల వేలంలో గురువారం జిందాల్ పవర్ రెండు, ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ హిందాల్కో ఇండస్ట్రీస్ ఒకటి చొప్పున బ్లాకులను దక్కించుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో గనులకు జిందాల్ పవర్ రూ. 1,679 కోట్లు, గెరె పామా బ్లాకు కోసం హిందాల్కో రూ. 14,858.9 కోట్లు వెచ్చించనున్నట్లు బొగ్గు శాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్.. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్వీటర్ ద్వారా వెల్లడించారు. గెరె పామా 4/5 బ్లాకులో 42.43 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా.

టన్నుకు రూ. 3,502 మేర బిడ్డింగ్ చేసి హిందాల్కో దీన్ని దక్కించుకున్నట్లు అనిల్ స్వరూప్ పేర్కొన్నారు. ఈ బ్లాకు కోసం దాదాపు 12 గంటల పాటు సాగిన బిడ్డింగ్‌లో హిందాల్కోతో పాటు అంబుజా సిమెంట్స్, బాల్కో, హిందాల్కో తదితర సంస్థలు పోటీపడ్డాయి. ప్రభుత్వం  మొదటి విడతగా 19 బొగ్గు బ్లాకులు వేలానికి ఉంచగా ఇప్పటిదాకా 15 బ్లాకులను కంపెనీలు దక్కించుకున్నాయి. బిఛర్‌పూర్ గనికి బిడ్డింగ్ కొనసాగుతోంది. తొలి విడత ఫిబ్రవరి 22న ముగియనుంది. జీఎంఆర్ ఛత్తీస్‌గఢ్ ఎనర్జీ, రిలయన్స్ సిమెంట్, సన్‌ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్, జైప్రకాష్ అసోసియేట్స్, బాల్కొ తదితర సంస్థలు బొగ్గు గనులను దక్కించుకున్నాయి. బొగ్గు బ్లాకుల వేలం ద్వారా ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు రూ. 50,000 కోట్ల పైచిలుకు ఆదాయం రాగలదని అంచనా.

Advertisement
 
Advertisement
Advertisement