
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
మండలంలోని ముత్తరపల్లె సత్రం సమీపంలో మామిడితోపులో యువతి ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి ...
తవణంపల్లె: మండలంలోని ముత్తరపల్లె సత్రం సమీపంలో మామిడితోపులో యువతి ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఎస్ఐ ధరణీధర కథనం మేరకు... చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లెకు చెందిన ఎస్కె నజీర్కు నలుగురు కుమార్తెలు. మూడవ కుమార్తె ఎస్కె ఆసియా(25) పట్టణంలోని విమ్సిన్ దుకాణంలో మూడేళ్లుగా పని చేస్తోంది. శనివారం రామనగర్ కాలనీలో నివాసమున్న అక్క ఎస్కె పర్వీన్తో మాట్లాడి బెంగళూరు ఇంటర్వ్యూకు హాజరుకావడానికి వెళతానని చెప్పి వెళ్లింది.
ఆదివారం ఉదయం మండలంలోని ముత్తరపల్లె సత్రం సమీపంలోని అన్నపూర్ణమ్మ మామిడితోపులో ఉన్న ఇంటిలో కిటికీకి సున్నితో ఉరివేసుకొని మృతి చెందింది. ఈ విషయాన్ని మామిడితోపు కాపలాదారు భాస్కరయ్య, అతని భార్య చిన్నమ్మ గుర్తించి తమ యజమానులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడున్న మూడు బ్యాగులను పరిశీలించారు. అందులో ఉన్న ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్ ఆధారంగా మృతురాలిని గుర్తించి తండ్రి నజీర్కు సమాచారం అందించారు.
నా బిడ్డను మోసగించి చంపేశారు : మృతురాలి తండ్రి నజీర్ ఆరోపణ
నా బిడ్డను మోసగించి చంపేశారని మృతురాలు ఆసియా తండ్రి నజీర్ ఆరోపించారు. తన కుమార్తెను చిత్తూరులోని శ్రీనివాస కల్యాణ మండపంలో బేకరీ నిర్వహిస్తున్న చింటూ అలియాస్ అరుణ్ ఏడాదిగా ప్రేమిస్తున్నాడని తెలిపారు. పలుమార్లు మందలించినా వెంటపడేవాడని పేర్కొన్నారు. చింటు పది రోజులు క్రితం మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడని, తనను ప్రేమించి మరో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావని ఆసియా అతన్ని నిలదీసిందని తెలిపారు. ఈ క్రమంలో అతను తన కుమార్తెను నమ్మించి పిలుచుకుని వచ్చి చింటు పెద్దమ్మ అన్నపూర్ణమ్మ ఇంటిలో చంపేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమ పేరుతో తన బిడ్డను హత్య చేసిన కిరాతకునిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.