మద్యం మత్తులో రోజూ శారీరకంగా, మానసికంగా చిత్ర హింసలకు గురిచేస్తున్న భర్తను భార్య హత్య చేసింది.
కూడేరు(అనంతపురం) : మద్యం మత్తులో రోజూ శారీరకంగా, మానసికంగా చిత్ర హింసలకు గురిచేస్తున్న భర్తను భార్య హత్య చేసింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలం ఉదిరిపి కొండలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన రుద్రప్ప(35), శకుంతలమ్మ(31)లకు పదేళ్ల కిందట వివాహమైంది. అప్పటినుంచి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో రుద్రప్ప గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై భార్యను అనుమానంచడంతోపాటు శారీరకంగా హింసిస్తున్నాడు. సోమవారం కూడా గొడవ పడి శకుంతలమ్మను కొట్టడంతో ఆమె విసిగిపోయి భర్తను కర్రతో కొట్టింది. దీంతో రుద్రప్ప మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.