
రాష్ట్ర రాజధానిగా తిరుపతి?
సీమాంధ్రకు కొత్తరాజధాని రేసులో తిరుపతి ఆధ్యాత్మిక నగరం సైతం ఉంది. రాష్ట్రం జూన్ 2 నుంచి 13 జిల్లాలతో ఏర్పడనుండటంతో సీమాంధ్ర రాజధానిగా....
- మూడు రోజుల్లో పరిశీలనకు రానున్న ఎంపిక కమిటీ
- రాజధానిగా అనుకూలతలపై ప్రత్యేక అధ్యయనం
- భూమి లభ్యత, రవాణా సదుపాయాలపై దృష్టి
సాక్షి, తిరుపతి : సీమాంధ్రకు కొత్తరాజధాని రేసులో తిరుపతి ఆధ్యాత్మిక నగరం సైతం ఉంది. రాష్ట్రం జూన్ 2 నుంచి 13 జిల్లాలతో ఏర్పడనుండటంతో సీమాంధ్ర రాజధానిగా ఏ నగరాన్ని ఎంపిక చేయాలనే అంశంపై కేంద్ర హోంశాఖ నియమించిన శివరామకృష్ణన్ కమిటీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ కమిటీ తిరుపతికి సైతం రానుంది. తిరుపతికి రాజధానిగా ఉన్న అనుకూలతలను లోతుగా అధ్యయనం చేయనుంది.
మే 9వ తేదీ విశాఖపట్టణం వస్తున్న శివరామకృష్ణన్ కమిటీ అక్కడ అధ్యయనం పూర్తి చేసుకుని విజయవాడ, గుంటూరు నగరాలను పరిశీలించనుంది. రెండవ దశలో కర్నూలు, తిరుపతి నగరాలకు రానుంది. తిరుపతిని రాజధానిగా చేయాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. చిత్తూరు జిల్లాలోని పలువురు రాజకీయ నాయకులతో పాటు, కొన్ని సంస్థల ప్రతినిధులు కూడా తిరుపతి రాష్ట్ర రాజధానిగా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాజధాని ఎంపిక కమిటీకి, కేంద్ర హోంశాఖకు తమ అభిప్రాయాలను ఈ-మెయిల్స్ ద్వారా తెలియజేశారు. దీంతో ఆరుగురు నిపుణులతో కూడిన శివరామకృష్ణన్ కమిటీ తిరుపతిలో కూడా పర్యటించి జనం అభిప్రాయాలను తెలుసుకోవాలని నిర్ణయించింది.
రాజధానిగా తిరుపతి అనుకూలతలు
తమిళనాడు రాజధాని చెన్నైకి 140 కిలోమీటర్లు, కర్ణాటక రాజధాని బెంగళూరుకు 240 కిలోమీటర్ల దూరంలో తిరుపతి నగరం ఉంది. భౌళిగోకంగా ఇది పెద్ద అనుకూలత. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన వేంకటేశ్వరుని పుణ్యక్షేత్రం తిరుమల కొండపై ఉంది. ఇక్కడికి దేశ, విదేశాల నుంచి ప్రముఖులు వస్తుంటారు. పర్యాటకంగా ఇప్పటికే తిరుపతి అంతర్జాతీయ ప్రసిద్ధిగాంచింది.
2008లోనే రేణిగుంట సమీపంలో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ పనులు ప్రారంభమయ్యాయి. మరో రెండేళ్లలో ఈ పనులు పూర్తి కానున్నాయి. తిరుపతి నుంచే గల్ఫ్దేశాలతో పాటు, యూరోపియన్ దేశాలకు, ఇతర దేశాలకు నేరుగా విమాన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది.
ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, ఇతర నగరాలకు తిరుపతి విమానాశ్రయం నుంచి రెగ్యులర్ విమానాలు నడుస్తున్నాయి.
తిరుపతి నుంచి ఢిల్లీ, ముంబై, కశ్మీర్ వంటి ఉత్తరాది రాష్ట్రాలకు, ఇటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి వంటి దక్షిణాది రాష్ట్రాలకు, మధ్యభారతదేశానికి రైలు సదుపాయం ఉంది. పలు సూపర్ఫాస్టు, ఎక్స్ప్రెస్రైళ్లు తిరుపతి మీదుగా నడుస్తున్నాయి. రేణిగుంటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ(సీఆర్ఎస్) ఉంది.
సచివాలయం, అసెంబ్లీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇతర కీలకమైన పరిశోధన, వైద్యవిజ్ఞాన సంస్థల నిర్మాణానికి ఏర్పేడు-వెంకటగిరి మధ్య ఐదువేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి.
తిరుపతి స్విమ్స్ సూపర్స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు, బర్డ్, రుయా వంటి ప్రాంతీయ, రాష్ట్రస్థాయి ఆస్పత్రులు ఉన్నాయి.
తిరుపతిలోనే రాష్ట్రస్థాయి యూనివర్సిటీలు ఆరు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ డీమ్డ్ యూనివర్సిటీ, రీజినల్ సైన్స్ సెంటర్ ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వ హోటల్ మేనేజ్మెంట్, టూరిజం విద్యాసంస్థలు ఉన్నాయి.
భద్రత కోసం ఇప్పటికే అర్బన్ పోలీస్ జిల్లా ఏర్పాటు చేశారు. భవిష్యత్లో దీన్నే పోలీస్ కమిషనరేట్గా మార్చుకోవచ్చు. ఇలా తిరుపతిని రాజధానిగా ఏర్పాటు చేసేందుకు అనేక అనుకూలాంశాలు ఉన్నాయి. కమిటీ రానున్న సందర్భంగా జిల్లాకు చెందిన మేధావులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు ఇలా పలు రంగాలకు చెందిన వారు తన అభిప్రాయాలను నిపుణుల దృష్టికి తీసుకొస్తే తిరుపతి కూడా ఇతర నగరాలతో సమానంగా రాజధాని ఎంపికకు పోటీ పడే అవకాశం ఉంది.