
మహిళల భద్రత దైవాదీనం!
రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయా? మహిళలపై నేరాలు, అఘాయిత్యాలు పెరిగిపోయాయా?
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను అరికడుతున్నామని, ఎక్కడ ఏం జరిగినా చిటికెలో పసిగడుతున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం మహిళలపై నేరాలను తగ్గించడంలో, రోడ్డు ప్రమాదాలను నివారించడంలో వైఫల్యం చెందినట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సీసీటీవీలు, కమాండ్ కంట్రోల్ కేంద్రాలు ఉన్నప్పటికీ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయినట్లు నివేదిక ఎత్తి చూపింది. చిత్తూరులో మినహా మిగతా అన్ని జిల్లాల్లో నాలుగు నెలలుగా వివిధ ఘటనల్లో మహిళా బాధితుల సంఖ్య పెరిగినట్లు స్పష్టం చేసింది. ఏప్రిల్ నుంచి జూలై వరకు అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో మహిళలపై నేరాలు, అఘాయిత్యాలు బాగా పెరిగిపోయాయి.
రాజధాని ప్రాంతమైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సైతం నాలుగు నెలల్లో 400 మంది చొప్పున మహిళలు వివిధ ఘటనల్లో బాధితులుగా నమోదవ్వడం గమనార్హం. ఇందులో చైన్ స్నాచింగ్ ఘటనలు కూడా ఉన్నాయి. వీధి వీధినా సీసీటీవీలున్నా నిందితులను పట్టుకుని, సొమ్ము రికవరీ చేయడంలో ఆశించిన ప్రగతి లేదు. రాజధాని ప్రాంతంలోని కాలనీల్లోనే మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లేందుకు జంకుతున్నారంటే ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిజంగా పని చేస్తున్నాయా.. లేక మొక్కుబడిగా బిగించి చేతులు దులుపుకున్నారా.. అనే సందేహం కలుగుతోంది. ఇదే నాలుగు నెలల వ్యవధిలో ఇతర రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ఘటనలు ఇందులో పాతిక వంతు కూడా లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ మహిళలపై అత్యాచారాలకు అంతే లేకుండా పోయింది. నాలుగు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 771 కేసులు నమోదైతే ఒక్క నెల్లూరులోనే 106 కేసులుండటం ఆందోళన కలిగిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఇలాంటిది ఒక్క ఘటన కూడా చోటుచేసుకోలేదు. ఈ లెక్కన రాష్ట్రంలో శాంతిభద్రతలు, నేరాలు అదుపు తప్పాయనడానికి ఇంతకంటే నిదర్శనం అక్కర లేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.